చైనాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఆన్లైన్ విక్రయాల పోర్టల్ ఆలీబాబా.. అత్యల్ప ధరలను ఆఫర్ చేస్తూ ఒకరోజు పాటూ నిర్వహించిన విక్రయాలు ఏకంగా ప్రపంచ రికార్డును సృష్టించాయి. చైనాలో ఏడాదికి ఒకసారి జరిగే సింగిల్స్డే సందర్భంగా.. ఉత్పత్తులను చాలా తక్కువ ధరలకు అమ్మడానికి ఆఫర్లు ప్రకటించింది. గ్లోబల్గా ఆఫర్చేసిన ఋ ఆన్లైన్ విక్రయాలను జేమ్స్బాండ్ డేనియల్ క్రెగ్ ప్రారంభించారు. 'ఒకరోజు ప్రత్యేక విక్రయాలు' ప్రారంభం కాగానే.. జనం ఎగబడ్డారు. ఒకే రోజులో ఏకంగా.. 14.33 బిలియన్ డాలర్లు.. అంటే 1.06 లక్షల కోట్ల రూపాయల విక్రయాలు జరిగిపోయాయి.
ఆలీబాబా వారి స్టాక్స్ మొత్తం సేలయిపోవడం విశేషం. ప్రపంచంలోనే ఆన్లైన్ విక్రయాలకు ఆదరణ పెరుగుతూ ఉందన్న సంగతి అందరికీ తెలిసినదే. అలాంటి నేపథ్యంలో మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి వారంతాకూడా ఈ రకమైన కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. ఆనేపథ్యంలోనే ఆలీబాబా అరుదైన రికార్డును సృష్టించిందని చెప్పుకోవాలి.
సాధారణంగా ప్రపంచమంతా జరుపుకునే వాలెంటైన్స్ డేకు వ్యతిరేకంగా.. చైనాలో నవంబరు 11న సింగిల్స్ డేను నిర్వహిస్తుంటారు. ఆ దేశానికి సంబంధించినంత వరకు ఇది అతిపెద్ద ఆన్లైన్ షాపింగ్ ఉత్సవంగా గుర్తింపు ఉంది. అమెరికాలో సైబర్ మండే లాగా చైనాలో ఈ రోజున ఆన్లైన్ విక్రయాలు పెద్దపెద్ద ఆఫర్లతో ఊరిస్తాయన్నమాట. ఆలీబాబా డాట్ కాం గత ఏడాది ఇదే రోజున పది బిలియన్ డాలర్ల (65వేల కోట్ల) బిజినెస్ చేసింది. ఈ ఏడాది ఆ రికార్డును అధిగమించి లక్ష కోట్ల రూపాయల వ్యాపారం సాగించింది. ముందు ముందు షాపింగ్ తీరుతెన్నులు అన్నీ మారిపోతుందనడానికి ఇది కూడా ఒక నిదర్శనం అనుకోవాలి.
చైనాలో , ప్రత్యేకించి తొలి 11 గంటల్లో 37వేల ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులకు, 2.20 లక్షల షియోమీ స్మార్ట్ ఫోన్లకు, 3.80 లక్షల మొబైల్ చార్జర్లకు ఆర్డర్లు వచ్చాయిట.