భారత దేశంలో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చిన రిలయన్స్ జియో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఫీచర్ ఫోన్ ఉత్పత్తులను నిలిపివేయనుందని వార్తలు వచ్చిన సంగతి విదితమే. దీనిపై స్పందించిన జియో ప్రతినిధులు అవన్నీ అవాస్తవమని ప్రకటించారు. ప్రస్తుతం జియో ఫీచర్ ఫోన్ల మొదటి దశ డెలివరీలు తుది స్థాయికి వచ్చాయని, త్వరలో రెండో విడత ప్రీ బుకింగ్కి సంబంధించిన తేదీలను విడుదల చేస్తామని పేర్కొన్నారు.
మరోవైపు `కై` ఆపరేటింగ్ సిస్టం ద్వారా పనిచేస్తున్న జియో ఫీచర్ ఫోన్లలో చాలా వరకు యాప్స్ పనిచేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక ఎయిర్టెల్ కూడా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే ఫీచర్ ఫోన్లను విడుదల చేయనుండటంతో పోటీని తట్టుకోలేననే భయంతో జియో ఫీచర్ ఫోన్ల ఉత్పత్తిని నిలిపివేసిందని `ఫ్యాక్టర్ డెయిలీ` ప్రచురించింది. మరోవైపు ఈ వార్తలన్నీ అవాస్తవమని జియో ప్రతినిధులు వెల్లడించారు.