తెలంగాణలో కొత్త జిల్లాల అవసరాలకు అనుగుణంగా కొత్త ఉద్యోగ నియామకాలు చేపడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు అన్ని శాఖలు.. జిల్లాల వారిగా ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు. ఆగస్టు 29న సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో, ఆ తర్వాత శాఖాధిపతులు, ముఖ్యకార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. దసరా నుంచి కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల నుంచి పరిపాలన ప్రారంభానికి ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
కొత్త జిల్లాల్లో పరిపాలన, అవసరాలపై అన్ని ప్రభుత్వ శాఖలు రెండు రోజుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మకు ప్రతిపాదనలను అందించాలని మార్గదర్శనం చేశారు. జోనల్ విధానం రద్దుకు ఇప్పటికే విధాననిర్ణయం తీసుకున్నామని, రాష్ట్రంలో ఇకపై జిల్లా, రాష్ట్ర స్థాయి కేడర్లు మాత్రమే ఉంటాయని తెలిపారు. జోనల్ అధికారులకు అన్యాయం జరగకుండా వారిని ఇతర ఉద్యోగాల్లో సర్దుబాటు చేస్తామని వెల్లడించారు. అధికారులు, ఉద్యోగులకు జిల్లాలను కేటాయించే క్రమంలో వారి ఇష్టాయిష్టాలను పరిగణనలోనికి తీసుకోవాలని, ఐచ్ఛికాలకు అవకాశం ఇవ్వాలని ఆదేశించారు. ఒకేరకమైన పనితీరు కలిగిన విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చి, ఒకే అధికారిని నియమించాలని సూచించారు.
ఉద్యోగాల పునర్ వ్యవస్థీకరణ జరగాలి: హరీష్రావు
కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగాల పునర్ వ్యవస్థీకరణ జరగాల్సిన అవసరం ఉందని మంత్రి హరీష్రావు అభిప్రాయపడ్డారు. ఇంజినీరింగు శాఖల్లో ఎస్ఈలు, సీఈలు, అటవీశాఖలో డీఎఫ్వోలు, కన్జర్వేటర్లు ఇలా రకరకాల పోస్టుల అవసరం లేదని, జిల్లా స్థాయి అధికారి ఒక్కరే ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.