ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఏపీ ఎస్సై పోస్టుల నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 707 ఖాళీల భర్తీకి ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సెప్టెంబరు 17న ప్రకటన జారీచేసింది. వీటికి సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 24 వరకు దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరిస్తారు.
ఏపీలో పోలీసు ఉద్యోగాలకు ప్రిలిమ్స్...
ఆంధ్రప్రదేశ్లో పోలీసు ఉద్యోగాల భర్తీకి తొలిసారిగా ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు. తొలుత ప్రాథమిక పరీక్షగా రాతపరీక్షను నిర్వహించి అనంతరం దేహదారుఢ్య పరీక్షలు చేపడుతారు. వీటిల్లో ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే మెయిన్స్ రాసేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ మేరకు పోలీసు నియామక మండలి రూపొందించి పంపించిన సంస్కరణల దస్త్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదం తెలిపారు. వీటికి సంబంధించిన తుది ఉత్తర్వులు ఒకట్రెండు రోజుల్లో వెలువడే అవకాశముంది. ముఖ్యాంశాలు..
* ప్రాథమిక అర్హత పరీక్షగా నిర్వహిస్తున్న అయిదు కిలోమీటర్ల పరుగు పందెంను పూర్తిగా ఎత్తివేశారు.
* సివిల్ ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల్లో 33 1/3 శాతం, అర్మ్డ్ రిజర్వు (ఏఆర్) విభాగంలోని పోస్టుల్లో 20 శాతం మేర మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. ఆయా పోస్టులకు అర్హులైన మహిళా అభ్యర్థులు లేకపోతే వాటిని పురుష అభ్యర్థులతో భర్తీ చేస్తారు.
ప్రిలిమ్స్ పరీక్ష: ఎస్సై పోస్టులకు సంబంధించి 200 మార్కులకు, కానిస్టేబుల్ పోస్టులకు 100 మార్కులు పరీక్షలు ఉంటాయి. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. దీనిలో ఓసీ అభ్యర్థులైతే 40 శాతం, బీసీలు 35 శాతం, ఎస్సీ, ఎస్టీలు 30 శాతం మార్కులు సాధించాలి. ఎస్సై అభ్యర్థులు చెరో 100 మార్కులకు రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది. ఈ రెండింటిలోనూ వేర్వేరుగా నిర్దేశిత అర్హత మార్కులు తప్పనిసరిగా సాధించాలి. కానిస్టేబుల్ అభ్యర్థులకు మాత్రం ఒకటే పేపరు ఉంటుంది. ప్రశ్నలన్నీ పూర్తిగా బహుళైచ్ఛిక విధానంలోనే ఉంటాయి. గణితం, రీజనింగ్, జనరల్స్టడీస్ వంటి అంశాలతో ప్రశ్నపత్రం ఉంటుంది.