‘టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్’ సంస్థ 2016-17 సంవత్సరానికి సంబంధించి గురువారం ప్రకటించిన ప్రతిష్టాత్మక వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాలకు స్థానం లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వర్సిటీల నుంచి 1,313 దరఖాస్తులు రాగా వాటి నుంచి అత్యున్నత ప్రమాణాలు పాటించే వర్సిటీలకు టైమ్స్ సంస్థ ర్యాంకులు ప్రకటించింది. ఆంధ్రా వర్సిటీ, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున వర్సిటీ, శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం, శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ, కాకినాడ జేఎన్టీయూ, అనంతపురం జేఎన్టీయూలు ఇందులో స్థానం సంపాదించాయి.
ఎస్వీయూ 600-800 మధ్య ర్యాంకింగ్లో నిలవగా.. ఏయూ, ఏఎన్యూలు 800 పైబడిన ర్యాంకుల్లో ఉన్నాయి. అత్యుత్తమ పనితీరు కనబర్చిన వర్సిటీల జాబితాలో ఎస్వీయూ ఉన్నత స్థానంలో ఉంది. ఎస్వీయూ వీసీ ఆవుల దామోదరం తీసుకున్న చర్యలు, పరిశోధనలే గాక వర్సిటీ మంచి పనితీరు కనబర్చి ఈ ర్యాంకింగ్ను సాధించింది. అలాగే ఏయూ, ఏఎన్యూలలో కూడా బోధన, పరిశోధనల పరంగా సాగించిన కృషికి ఈ ర్యాంకింగ్ లభించింది. ఇక తెలంగాణ నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం మాత్రమే చోటు దక్కించుకుంది.