అమరావతిలో ఇప్పటికే విట్, ఎస్ఆర్ఎం, అమృత, ఇండో-యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, బీఆర్ షెట్టి గ్రూపు, జాతీయ ఆకృతుల సంస్థ(ఎన్ఐడీ)లకు విద్యాసంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే స్థలాలు కేటాయించగా, తాజాగా మరో ఏడు సంస్థలు ఇక్కడ వర్సిటీలు, విద్యాసంస్థల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) ఇచ్చిన ప్రకటనకు స్పందిస్తూ, ప్రతిపాదనలు సమర్పించాయి. బెంగళూరుకు చెందిన పీఈఎస్ సంస్థ- యూనివర్శిటీని, భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ)- విజ్ఞాన విశ్వవిద్యాలయాన్ని, గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయం- ‘అమరావతి ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ’ని, ‘కిమ్స్’- ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించాయి.
గీతమ్ విశ్వవిద్యాలయం, ఐఎస్బీఆర్ బిజినెస్ స్కూల్, ఎక్స్ఎల్ఆర్ఐ వర్సిటీల ఏర్పాటుకు ఆయా సంస్థలు ముందుకొచ్చాయి.యూనివర్సిటీలకు ఒకే విధానం! అమరావతిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు నెలకొల్పాలనుకుంటున్న ప్రభుత్వం.. వాటికి స్థలాల కేటాయింపునకు ఏకరూప విధానం అనుసరిస్తోంది. యూనివర్సిటీలకు లీజు ప్రాతిపదికన కాకుండా, పూర్తి హక్కులతో కూడిన ‘ప్రిహోల్డ్’ విధానంలో స్థలాలు కేటాయిస్తోంది. మిగతా సంస్థల్లానే కొత్తగా వచ్చే సంస్థలకు ఎకరం రూ.50 లక్షల చొప్పున ఇచ్చే అవకాశముందని సీఆర్డీఏ వర్గాలు తెలిపాయి. స్థలాలు పొందిన సంస్థల్లో విట్ పనులు ప్రారంభించింది. ఎస్ఆర్ఎంకు నీరుకొండ వద్ద, అమృతకు నవులూరు వద్ద, ఇండో-యూకే సంస్థకు కృష్ణాయపాలెం లేదా నవులూరు వద్ద, బీఆర్ షెట్టి గ్రూప్నకు పిచ్చుకలపాలెం వద్ద స్థలం కేటాయించనున్నారు.