వచ్చే వైద్యవిద్య సంవత్సరం (2017—18)లో నీట్ ర్యాంకుల ద్వారానే ఆయుష్ సీట్లను భర్తీ చేయాలని కోరుతూ కేంద్ర సర్కారు నుంచి తెలంగాణకు లేఖ అందింది. ఇప్పటికే నీట్ ర్యాంకుల ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్యవిద్య కోర్సుల ప్రవేశాలను చేపట్టాలని నిర్ణయించగా తాజాగా ఆయుష్ కోర్సులు చేరాయి. దీంతో రాష్ట్రంలో బైపీసీ విద్యార్థులు వ్యవసాయ, పశువైద్య, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మాత్రమే ఎంసెట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. గతేడాది నీట్ నిర్వహించినా రాష్ట్రంలో వేర్వేరుగా చేపట్టిన రెండు ఎంసెట్ పరీక్షల ద్వారానే ఎంబీబీఎస్/బీడీఎస్, ఆయుష్ కోర్సుల ప్రవేశాలను నిర్వహించారు.
జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ర్యాంకుల ప్రాతిపదికన ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల ప్రవేశాలను నిర్వహించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఆయుష్ కోర్సులు కూడా నీట్ పరిధిలోకి పోవడంతో ఇకపై ఎంసెట్ (అగ్రికల్చర్) అని మాత్రమే ప్రకటన జారీచేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.