ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణ, దరఖాస్తుల ప్రక్రియను చేపట్టేందుకు సర్వీస్ ప్రొవైడర్ల ఎంపికపై నెలకొన్న వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. తెలంగాణ ఉన్నత విద్యామండలి నియమించిన కమిటీ.. నిబంధనల మేరకే సర్వీస్ ప్రొవైడర్లను ఎంపిక చేసిందని, అందులో అభ్యంతరం చెప్పాల్సింది ఏమీలేదని రాష్ట్ర సాంకేతిక సేవల సంస్థ (టీఎస్టీఎస్) అభిప్రాయపడింది. దాంతో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆచార్య శుక్రవారం(మార్చి 10) ఆమోదం తెలిపారు.
ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు ఒక సంస్థకు, ఆఫ్లైన్కు మరో సంస్థను ఎంపిక చేసిన ఉన్నత విద్యామండలి.. ఆ సంస్థ ప్రతినిధులకు సమాచారం ఇచ్చింది. ఆయా ప్రవేశ పరీక్షల కన్వీనర్లకు కూడా సమాచారం ఇచ్చామని, వారే ప్రకటనలు జారీ చేస్తారని, మారిన దరఖాస్తుల తేదీలను ప్రకటిస్తారని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఎంసెట్ కన్వీనర్ ఆచార్య యాదయ్య మాట్లాడుతూ.. ఒకటీ రెండు రోజుల్లో ప్రకటన జారీ చేసి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు.