ఆంధ్రప్రదేశ్లో ఎస్సై ఉద్యోగాల తుది ఫలితాలు మార్చి 24న రాత్రి విడుదలయ్యాయి. మొత్తం 707 పోస్టులకు 699 పోస్టులు భర్తీ అయ్యాయి. తగిన రిజర్వేషను కలిగిన అభ్యర్థులు లభించక పోవడంవల్ల మిగతా 8 పోస్టులు భర్తీ కాలేదు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పోలీసు నియామక మండలి వెబ్సైట్లో పొందుపరిచినట్లు నియామక మండలి ఛైర్మన్ అతుల్సింగ్ తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెల రోజుల వ్యవధిలో శిక్షణ ప్రారంభిస్తామన్నారు. ఎస్సై(సివిల్) ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 355 పోస్టులకు గాను 349 పోస్టులే భర్తీ అయ్యాయి.
6 పోస్టులు భర్తీ కాలేదు. ఆర్ఎస్సై(అర్మడ్ రిజర్వు) పోస్టు ఒకటి, అసిస్టెంట్ మాట్రిన్ పోస్టు ఒకటి భర్తీ కాలేదు. ఫిబ్రవరి 18, 19వ తేదీల్లో తుది రాత పరీక్ష నిర్వహించగా...మార్చి 6వ తేదీన వాటి ఫలితాలు విడుదల చేశారు. వాటికి సంబంధించి మార్చి 15వ తేదీ వరకూ అభ్యంతరాలు స్వీకరించారు. వీటిన్నింటినీ పరిశీలించిన అనంతరం ప్రతిభావంతుల జాబితా సిద్ధం చేయగా...ఎస్సై(సివిల్), డిప్యూటీ జైలర్/అసిస్టెంట్ మాట్రిన్ పోస్టులకు సంబంధించి 17,366 మంది, ఆర్ఎస్సై (ఏఆర్), ఆర్ఎస్సై (ఏపీఎస్పీ/ఎస్ఏఆర్ సీపీఎల్)లకు సంబంధించి 13,645 మంది అభ్యర్థులు అర్హత సాధించగా...ఆ జాబితా నుంచి రిజర్వేషను, అభ్యర్థులు సాధించిన మార్కులు ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు అతుల్సింగ్ వివరించారు. ఏవైనా సందేహాలంటే అభ్యర్థులు పోలీసు నియామక మండలి సహాయ కేంద్రాల ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.