ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 86/2003 ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు భాషను తప్పనిసరి బోధనాంశంగా అమలు చేయాలని, జీవో నంబర్ 14/2017ను రద్దు చేసి మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు మాధ్యమంలోనే విద్యాబోధన జరిపి, పూర్వ స్థితికొనసాగించాలని ‘తెలుగుదండు’ రాష్ట్ర సదస్సు తీర్మానించింది. తెలుగుదండు సమన్వయకర్త పరవస్తు ఫణిశయ సూరి ఆధ్వర్యంలో ఆదివారం విశాఖపట్నంలో సమాలోచన సదస్సు జరిగింది. మాతృభాషను కాపాడుకుంటేనే జాతి మనుగడ సాగిస్తుందని సదస్సులో పలువురు అభిప్రాయపడ్డారు. సూరి మాట్లాడుతూ సంస్ధ ఆవిర్భావం ఆవశ్యకత, ఆశయాలు, లక్ష్యాలను వివరించారు. డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్ , డాక్టర్ ఎస్.విజయకుమార్, ఆచార్య యార్లగడ్డ లక్షీప్రసాద్, ఆచార్య ఎం.జయదేవ్, రాజగోపాల్ ఆచార్యులు, వైవీఎస్ శర్మ, పి.కోదండరామయ్య, జి.మధు ప్రసంగించారు.