భారత దేశంలో అక్షరాస్యత లేని వారు ఎంతో మంది ఉన్నారు. అయితే వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేస్తూ అందరకి విద్యనందించేందుకు కృషి చేస్తుంది. అయితే చాలా మంది విద్యార్థులు చదువుకోవాలన్న తపన ఉన్నా..పాఠశాలలు దూరంగా ఉండటంతో ఎక్కువ దూరం నడిచి వేళ్లలేని పరిస్థితి నెలకొంటుంది. దీంతో ఎంతో మంది విద్యార్థులు చదువుకోలేక నిరక్షరాస్యులుగానే మిగిలిపోతున్నారు. తాజాగా విద్యార్థులు మూడు కిలోమీటర్లు లేక అంతకన్నా ఎక్కువ దూరం నడిచి పాఠశాలలకు వెళ్లడాన్ని ఊహించలేమని భారత సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఇందుకోసం విద్యార్థి తన దగ్గరలోనే విద్యను పొందడం ప్రాథమిక హక్కు అని వెల్లడించింది. ఈ విషయంపై సరైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైన ఉందని స్పష్టం చేసింది. ఈ మద్య కేరళ నుంచి దాఖలైన ఓ పిటిషన్ను న్యాయమూర్తులు మదన్ బి లోకూర్, దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి తాజా వ్యాఖ్యలు చేసింది.
ఈ విషయంపై భారత దేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన కేరళ రాష్ట్రంలో ఓ ప్రైమరీ స్కూల్ను ప్రాథమికోన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం 2015లో నిర్ణయం తీసుకున్నది. కాగా.. దీనిని వ్యతిరేకిస్తూ మరో పాఠశాల.. హైకోర్టును ఆశ్రయించింది. కాగా దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. స్కూల్ను అప్గ్రేడ్ చేయవద్దని వెల్లడించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 10 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలు ఎక్కువ దూరం నడిచి పాఠశాలలకు వెళ్లకుండా ఉండేందుకు ప్రైమరీ స్కూల్ను అప్గ్రేడ్ చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది.