సిజీజీ వల్ల జరిగిన ఒక తప్పిదం వలన 2011 గ్రూప్‌-1 అభ్యర్ధులు చాలా అందోళన పడ్డారు. అభ్యర్ధులు వెంటనే అధికారులని సంప్రదించడం వలన నిజా నిజాలు తెలుసుకున్న అధికారులు తగిన చర్యలు తీసునేవరకు ఇప్పుడు ఇచ్చిన పోస్టింగ్స్ రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. వివరాలలోకి వెళ్తే శనివారం విడుదల చేసిన 2011 గ్రూప్‌-1 పోస్టింగులను టీఎస్‌పీఎస్సీ సోమవారం రద్దు చేసింది. త్వరలోనే తుది పోస్టింగుల జాబితాను ప్రకటించనున్నట్లు  టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్‌ తెలిపారు. అయితే, తుది ఫలితాలు ప్రకటించినా సెలక్షన్‌ జాబితా మారదు.


అభ్యర్థుల తుది ర్యాంకులు మారవు. కేవలం పోస్టింగులు మాత్రమే మారతాయి. ఇందుకు కారణం.. పోస్టుల ఎంపికకు అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లు కొన్ని కారణాల వలన మారిపోయాయి. 2011 గ్రూప్‌-1లో 127 పోస్టులకు121 మందిని ఎంపిక చేస్తూ శనివారం టీఎస్‌పీఎస్సీ  ఫలితాలు ప్రకటించింది.. వారిలో టాప్‌టెన్‌ వివరాలను ఆదివారం విడుదల చేసింది. నాలుగో ర్యాంకర్‌ అయిన మహిళా అభ్యర్థికి ఎంపీడీవో పోస్టింగ్‌ వచ్చింది. టాపర్‌గా నిలిచిన ఓసీ మహిళ మాధురికి డిప్యూటీ కలెక్టర్‌ పోస్టు రాగా నాలుగో ర్యాంకర్‌ నెల్లూరి వాణికి ఎంపీడీవో పోస్టు రావడంపై అనుమానం వచ్చింది.

 

నిజానికి ఆమె డిప్యూటీ కలెక్టర్‌ పోస్టుకు ఆప్షన్‌ ఇచ్చారు. తాను ఇచ్చిన 11ఆప్షన్లలో ఎంపీడీవో కంటే మంచి పోస్టింగ్‌ వస్తుందని ఆమె భావించారు. దాంతో ఆమె ఆందోళనకు గురై సోమవారం కమిషన్‌ను ఆశ్రయించారు. ఆమెతోపాటు మరి కొంత మంది ఎంపికైన చాలా మంది అభ్యర్ధులు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చిన మాదిరిగా కాకుండా మరో విధంగా పోస్టింగ్‌ వచ్చిందని సోమవారం టీఎ్‌సపీఎస్సీ అధికారులను ఆశ్రయించారు. అధికారులు విచారణ జరుపగా..పోస్టింగుల ఎంపికకు అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఇచ్చిన వెబ్‌ ఆప్షన్లు తారుమారు అయ్యాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వెంటనే, సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) అధికారులతో విచారణ చేయగా ..ఆన్‌లైన్‌ ఆప్షన్లు, మాన్యువల్‌గా ఇచ్చిన ఆప్షన్లను తనిఖీ చేయగా, ఆప్షన్లు మారిపోయినట్లు ధ్రువీకరించారు.

 

అయితే కేవలం ఫిర్యాదు చేసిన వారి ఆప్షన్లు మాత్రమే కాకుండా మొత్తం 121మంది వెబ్‌ ఆప్షన్లు పరిశీలించాలని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి, ఇతర సభ్యులు, సెక్రటరీ వాణీప్రసాద్‌ సీజీజీ అధికారులను ఆదేశించారు. శనివారం ప్రకటించిన పోస్టింగులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఫైనల్‌ పోస్టింగుల జాబితాను ప్రకటించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ వాణి ప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్ధులు ఎవ్వరికీ కూడా ఎటువంటి అన్యాయం జరగదు అని ఎవ్వరు అందోళన పడవలసిన అవసరం లేదని త్వరలోనే జాబితా విడుదల చేస్తాం అని ప్రకటించింది ప్రభుత్వం


మరింత సమాచారం తెలుసుకోండి: