ప్రపంచంలో భారత దేశం అంటే అందరూ అభిమానిస్తారు..దీనికి కారణం భారత దేశంలో అన్ని సంస్కృతులు, సంప్రదాయాలు, ఆచార వ్యవహరాలు, కట్టుబాట్లతో నిండిన భారతదేశంలో వైవాహిక వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇటువంటి ఆచారవ్యవహారాలే ప్రపంచ దేశాల్లో మనదేశానికి ఒక విశిష్టతను ఆపాదించిపెట్టాయి. కాగా ఇటువంటి వ్యవస్థలో “సహజీవనం” నూతనంగా ప్రవేశించి దేశంపై తనదైన ముద్ర వేసుకుంది. వివాహం చేసుకోకుండా కలిసి జీవించడమే సహజీవనం ప్రత్యేకత.
ఒకప్పుడు మహరాజులు కూడా తమకు నచ్చిన వారిని వివాహం చేసుకోకుండా వారితో సహజీవనం చేస్తూ వచ్చారు..అలాంటి సంస్కృతిని అప్పట్లో బాగా వ్యతిరేకించే వారు. ఇక సహజీవనం (డేటింగ్) వైపు యువతీ యువకులు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. దీని ప్రభావం సమాజంలో రోజురోజుకు పెరిగిపోతుంది. మారుతున్న కాలంతో జీవనశైలిలో కూడా అనేక మార్పులు వచ్చాయి. సమాచార, సాంకేతిక రంగాల్లో పలుమార్పులు రావడంతో ఇటువంటి మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ఆదాయం పెరుగడంతో ఎగువ మద్యతరగతి, దిగువ మద్యతరగతి వర్గాల్లో కొంతమంది పాశ్చత్య పోకడలకు అలవాటుపడుతున్నారు. పోటీ తత్వంతో కూడిన వాతావరణంలో స్త్రీ,పురుష భేదం లేకుండా ఒకరితో ఒకరు విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కలిసిమెలసి పనిచేయాల్సి ఉండడంతో పరిచయాలు స్నేహాలుగా, స్నేహాలు సహజీవనాలుగా మారుతున్నాయి.
వివాహమైన తర్వాత ఇద్దరి మద్యన అభిప్రాయభేదాలు వచ్చి విడాకుల వరకు దారితీసే సంఘటనలు అనేకం ఉన్నాయి. కాగా అటువంటి ఇబ్బంది రాకుండా ముందుగానే ఒకర్నొకరు అర్ధం చేసుకోవడానికి కలిసి జీవించాలనే అవగాహనకు వస్తున్నారు. ఇద్దరి మద్యన అభిప్రాయ భేదాలు, ఆలోచనలు కలవకపోతే సింపుల్ గా విడిపోతున్నారు. కలిస్తే వివాహం చేసుకుంటున్నారు. కాగా ఇన్నాళ్లు కలసున్నాం కదా ఇంకా పెళ్లెందుకులే అనుకున్నవారు కూడా కలిసి సహజీవనం సాగించేవారు అనేకం ఉన్నారు.