అర్జునుడు:
మనందరం అర్జునుడ్ని ఆదర్శంగా తీసుకోవాలి. 'నిండు కుండ తొణకదు' లాంటి మనస్థత్వం. అంటే మహావీరుడు, అయినా ఆవేశపరుడూ కాదు. బలం ఉంది, అయినా ఊరికే కయ్యానికి కాలు దువ్వడు. వాక్శుద్ది ఉంది, అయినా వాక్కులో పరుషత్వం లేదు. బుద్ధుశాలి, అయినా అన్నగారి మాట జవదాటడ. అన్న చెపితే 'సరే' అంటాడు. కావటానికి బావ అయినా ప్రాణములో ప్రాణమైన కృష్ణుణ్ణి సంప్రదిస్తాడు. ఇదీ విశిష్ట వ్యక్తిత్వం అంటే.
ఎంతటివాడికైనా 'కూల్ థింకింగ్' కావాలి. ఆప్తుల సలహా పాటించాలి. మహాభారత యుద్ధ ప్రారంభంలో "ఈ యుద్ధం చెయ్యలేను బాబూ" అంటూ చతికిలపడ్డాడు. అలా డీలా పడే సమయమా! అది? మరెందుకు దిగులు చెందాడు. అదే మానవ సంబంధం అంటే. బంధుత్వం అంటే. "తనవారి ప్రాణాలు విలువైనవా? నెత్తుటి కూడు విలువైనదా?' - అన్న మీమాంస రావాలి. వచ్చింది అర్జునునికి అపత్కాలంలో మనిషికి వచ్చే - రావలసిన ఆలోచనే ఇది!! అందుకే ది బెస్ట్ పర్సనాలిటి అంటే అర్జునునిదే. గొప్ప మానవతావాది.
శ్రీకృష్ణుడు:
ప్రతి కుటుంబానికి లేదా ప్రతి కంపెనికి ఒక పెద్ద దిక్కు ఉండాలి. మంచో చెడో అతని మీద బాధ్యత పెడతాం. అన్నీ అతనే చూసు కుంటాడు అని అంటాం. ఆ పెద్ద మనిషి ఎవరో కాదు "శ్రీకృష్ణుడు" ఈ కాలానికి శ్రీకృష్ణ సముడు ఆయహ నాయకత్వం కావాలి. మహాభారతం లో రెండు, మూడు చోట్ల తప్ప అతడు భగవంతుడు కానే కాడు, మానవుడే, మానవుడుగానే అందరిని భ్రమింపజేశాడు. మేధావి, బహుముఖ ప్రజ్ఞావంతుడు. స్నేహశీలి. "ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికా మాట లాడు" అనగల చతురుడు. చమత్కారి.
పనిని సాధించటంలో ఎక్కడైనా చక్రం తిప్ప గల సమర్ఢుడు. "బమ్మిని తిమ్మి,తిమ్మిని బమ్మి" చేయగల చాతుర్యశీలి. ధర్మరాజుకి కోపమూ తెప్పించగలడు - భీముడి నోట శాంతవచనాలు పలికించగలడు. అర్జునునితో యుద్ధమూ చేయించగలడు. పాండవులు అందరినీ ఒకే తాటిమీదకి తీసుకువచ్చి ఎత్తుకు పై ఎత్తులు వేసి- శత్రువుల్ని రెచ్చ గొట్టి - శత్రువుల చేత తప్పులు చేయించి విజయాలు సాధించగలడు. కాగల కార్యం గంధ్ర్వులతో చేయించి తాను నిమిత్తమాతృణ్ణి అని అనగల ధీశాలి.
శత్రువుపై ప్రజా వ్యతిరేకతను ఒక ఆయుధంగా మలచ గలడు. రాయబారానికి వెళ్ళి "జాగ్రత్త" అని హెచ్చరించ గలడు. యుద్ధాన్ని ఎందుకు కోరు కున్నాడు అంటే యుద్ధం తప్పదని తెలుసు కాబట్టి. సుదీర్ఘ ద్రష్ట కాబట్టి. తన ప్రాణాధిక సోదరి ద్రౌపది, అవమానభారం తొలగాలంటే యుద్ధం రావాలన్న తెలివి ఉంది కాబట్టి. కౌరవుల దుర్మార్గాలకి అడ్డుకట్ట వేయాలి కాబట్టి - వారి అకృత్యాలను అలా కొనసాగించనివ్వ కూడదు కాబట్టి. "కార్య నిర్వహణ" - "వర్క్ మేనేజిమెంట్ ఆన్ టైం" అంటే "టైం మేనేజిమెంట్ విత్ వర్క్" అనేది మనం శ్రీకృష్ణుడు నుంచి నేర్చుకోవాలసిన వ్యక్తిత్వ సూత్రం.
త్రేతాయుగం తరవాత కాలాంతరములో శ్రీకృష్ణ తత్వము, ఆలోచనా విధానమే స్వల్ప రూపాంతరీకరణతో చాణక్యతంత్రం గా మారిందనవచ్చు. నాటికీ నేటికీ ఏనాటికీ సరిగ్గా సరిపడే మానవ వ్యక్తిత్వ వికాసాన్ని శ్రీకృష్ణుని నుండే పొందారు మన చాణక్యులవారు.