కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతికతను పిల్లల నుంచి పెద్దల వరకు అందిపుచ్చుకుంటున్నారు. నిత్యంవాటితోనే మమేకమవుతున్నారు. ఇదే సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి విడుదలయ్యే కాంతి తమ ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని గుర్తించలేకపోతున్నారు.
ముఖ్యంగా నీలికాంతి, గాడ్జెట్స్తోకంటిచూపు, ఆరోగ్యాన్ని కోల్పోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరైన పోషకాహారం లేక, విటమిన్లు, జన్యుపరమైన లోపం కారణంగా దృష్టి లోపాలు, అంధత్వ సమస్యలు రావడం సహజం. కంటిచూపు బాగున్నా ఎలక్ట్రానిక్ వస్తువులు మితిమీరి వినియోగించడం ద్వారా కంటిచూపు కోల్పోవాల్సి వస్తోంది. ఉద్యోగ, వ్యాపారరీత్యా కంప్యూటర్లు, ట్యాబ్లు, సెల్ఫోన్లు వినియోగిస్తున్న వారు కొందరైతే వినోదం, కాలక్షేపం కోసం వినియోగిస్తున్నవారు మరికొందరు.
వినోదమైన వాటి వాడకం ఎక్కువైతే వాటి నుంచి వెలువడే కాంతి వల్ల కంటి రెటీనాలోని ఫొటో రేస్పాట్స్ దెబ్బతింటాయి. కంటిలోని అతి సున్నితమైన ఈ భాగంపై ఎక్కువసేపు కాంతిపడడం వల్ల చూపు తగ్గుతుంది. ఇటీవల ఎక్కువగా 6వ తరగతి పిల్లల నుంచి యువత వరకు దృష్టిలోపంతో ఎక్కువ మంది దవాఖానలకు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. టీవీ, ల్యాబ్టాబ్ల్లో, కంప్యూటర్, సెల్ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల జిల్లాలోని 30 నుంచి 40శాతం మంది దృష్టిలోపం బారిన పడుతున్నట్లు గుర్తించారు.
✴కంటిపైనే అధికం..
ప్రస్తుత సమాజంలో మొబైల్ ఫోన్ మన శరీరంలో ఒక భాగమైపోయింది. ఎక్కువ సమయం దానితోనే గడుపుతున్నారు. సెల్ఫోన్ బ్రౌజింగ్, చాటింగ్, మెసేజ్లు చూస్తుంటారు. రాత్రిళ్లు కూడా ఎక్కువసేపు దాంతోనే కాలక్షేపం చేస్తుంటారు. చాలా మందికి రాత్రిపూట వాట్సాప్, ఫేస్బుక్ టెలిగ్రామ్, ట్విట్టర్లో వచ్చిన మేసేజ్లను చూసుకుని వాటికి సమాధానాలు ఇస్తుంటారు. అందుకోసం గదిలో లైట్లు ఆర్పేసి సెల్ఫోన్తో ఎక్కువ సమయం గడుపుతుంటారు. దాని నుంచి విడుదలయ్యే నీలికాంతి నేరుగా మన కంటిలోకి ప్రవేశిస్తుంది. ట్యాబ్లు, ల్యాబ్టాప్లు, డెస్క్టాప్ల ముందు ఎక్కువ సేపు కూర్చున్నా వాటి నుంచి వచ్చే కాంతి ప్రభావం వల్ల చూపు మందగించడం, దృష్టి లోపాల సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
ఆరోగ్య సమస్యలు మెండు
నీలికాంతి వల్ల కేవలం కంటిచూపు సమస్యలే కాదు. ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు అంటున్నారు. హార్మోన్లపై ప్రభావం చూపడం, గుండె చప్పుడు, ఆప్రమత్తత, చురుకుదనం, సహజమైన నిద్ర అలవాటుకు భంగం వాటిల్లేలా చేస్తుందని చెబుతున్నారు. నీలికాంతి శరీర ఉష్ణోగ్రత పెరగడానికి, నిద్రమత్తు తగ్గించడానికి కారణమవుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.
రెటీనా దెబ్బతింటుంది..
సెల్ఫోన్ నుంచి వచ్చే కాంతి కంటి వెనుక భాగంలోకి వెళ్లడంతో కన్నుకు ప్రమాదముంది. దీనివల్ల రెటీనా దెబ్బతినే అవకాశం ఉంది. కళ్లు అత్యధిక నీలికాంతి ప్రసరణకు గురైతే చూపు కోల్పోవడం, వయస్సు సంబంధిత మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది.
🔵నీలికాంతి అంటే?
కాంతి వర్ణపటంలో అతినీలలోహిత కిరణాలు, పరారుణ కిరణాలు, కన్పించే కిరణాలు ఉంటాయి. నీలికాంతి కన్పించే కిరణాల్లో ఒక భాగం, అధికశక్తి తరంగధైర్గ్యం కలది.
సహజకాంతి అవసరమే..
సూర్యకాంతి నుంచి లభించే నీలికాంతి మన దైనందిన కార్యక్రమాలు, అవసరాల్లో ఒక భాగం. మెదడుకు, జ్ఞాపకశక్తికి సహకరించేందుకు అప్రమత్తంగా ఉంచి, మానసిక స్థితిని ఉన్నతంగా చేసేందుకు సహాయ పడుతుంది. అందుకే సైకాలజిస్టులు కొందరు రోగులకు సన్థెరపీని సూచిస్తుంటారు.