అన్ని సీజన్లలోను దొరుకుతూ అందరికీ అందుబాటు ధరలలో ఉండే అరటి పండ్ల ప్రయోజనాల గురించి ఇప్పటికే అనేకమంది అనేక విధాలుగా వివరించారు. పురాతన కాలం నుంచి అరటి పండ్లు మనకు పోషకాలనిచ్చే ఆహారంగా గుర్తించడంతో మన ఆయుర్వేద శాస్త్రంలో కూడ ఈ అరటి పండ్లకు విపరీతమైన ప్రాముఖ్యత ఉంది. దీనికితోడు వివిధ రకాల అనారోగ్యాలను దూరం చేయడంలో అరటి పండ్లు ఔషధంగా పనిచేస్తున్నాయి.
ప్రపంచలోని ఏ క్రీడాకారున్ని తీసుకున్నా వారు తినే పండ్లలో మొదటి ప్రాధాన్యత అరటి పండుకే ఇస్తారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దీనితో ఎవరైనా సరే రోజుకి 3 అరటిపండ్లను తినడం చాలా మంచిదని అలోపతి వైద్యులు కూడ చెబుతున్నారు. వీటివల్ల మన శరీరానికి నిత్యం కావల్సిన మోతాదులో పొటాషియం అందడమే కాకుండా మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసే సమయాల్లో ఒక్కో అరటి పండును తీసుకుంటే గుండె జబ్బుల బారిన పడకుండా రక్షింపబడే అవకాశం ఉంటుందని పరిశోధనల్లో వెల్లడైంది.
దీనికారణం ప్రతి అరటిపండులోను దాదాపుగా 500 మిల్లీగ్రాముల పొటాషియం ఉండడం వల్ల రోజూ వీటిని 3 వరకు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు తేల్చి చెబుతున్నారు. అదేవిధంగా శరీరంలోని ద్రవాలను కావల్సిన స్థాయిలో ఉంచేందుకు, బీపీని తగ్గించేందుకు ఈ అరటి పండు అమోఘంగా పనిచేస్తుంది. దీనికితోడు మనం నిత్యం తినే ఆహారంలో ఉండే అత్యధిక లవణాల గాఢత కారణంగా ఎముకలు త్వరగా అరిగిపోతాయి. అయితే అరటి పండ్లను తింటే ఎముకలు దృఢంగా మారడంతోపాటు ఎముకల సాంద్రత కూడా పెరుగుతుంది అని వైద్యులు తెలియచేస్తున్నారు.
ప్రధానంగా విద్యార్థులు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనాల్లో అరటిపండును తీసుకుంటే తమ జ్ఞాపకశక్తిని వృద్ధి చేసుకోవచ్చు. రక్తహీనతను నివారించడంలో అరటిపండ్లు మెరుగ్గా పనిచేస్తాయి. వీటిలో ఉండే ఐరన్ రక్తం, హిమోగ్లోబిన్ల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. పీచు పదార్ధం ఎక్కువగా ఉండే అరటిపండ్లు మలబద్దకాన్ని నివారిస్తాయి. ఇలా ఎన్నో ప్రయోజనాలు కలిగిన ఈ అరటిపండు సామాన్యుడి పాలిట ఒక వరం అనుకోవాలి..