సినీనటి రంభ గుర్తుందా.. 90వ దశకంలో తెలుగుతో పాటు తమిళ చిత్రసీమలోనూ ఓ వెలుగు వెలిగిన అచ్చ తెలుగు నటి. ఆ ఒక్కటీ అడక్కు సినిమా ద్వారా దర్శకుడు ఈవీవీ ఈ తెలుగింటమ్మాయిని వెండితెరకు పరిచయం చేశారు. చిరంజీవి, బాలకృష్ణ వంటి టాలీవుడ్ అగ్రనటులతో పాటు.. రజినీకాంత్ వంటి తమిళ స్టార్లతోనూ సూపర్ హిట్ సినిమాలు చేసింది రంభ. హీరోయిన్ గా ఫేడ్ అవుట్ ఐన తర్వాత.. దేశముదురు వంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్ కూడా చేసింది రంభ. 2012 డిసెంబర్లో వ్యాపారవేత్త ఇంద్రకుమార్ ని రంభ పెళ్లి చేసుకొని కెనడాలో మకాం పెట్టింది రంభ. వీరికి లాస్య అనే కుమార్తె పుట్టింది. అయితే భర్త నుంచి రంభ విడాకులు తీసుకున్నట్లు ఆమధ్య వార్తలు కూడా వచ్చినా.. అవన్నీపుకార్లేనని రంభ వివరణ ఇచ్చింది. తాజాకబురేంటంటే.. సినీనటి రంభపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వరకట్న వేధింపుల కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే... పదిహేనేళ్ల క్రితం రంభ సోదరుడు శ్రీనివాసరావుకు పెళ్లైంది. బంజారాహిల్స్ వాసి పల్లవితో ఈ పెళ్లైంది. వివాహం సమయంలో డబ్బు, బంగారు నగలు కట్నంగా ఇచ్చారు. చెన్నైలో నివసిస్తున్న వీరికి ఇద్దరు పిల్లలు కూడా. పెళ్లై పదిహేనేళ్లయ్యాక ఇప్పుడు పల్లవి.. అత్తింటివారు కట్నం కోసం వేధిస్తున్నారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అత్తమామలతోపాటు ఆడబిడ్డ రంభ కూడా అదనపు కట్నం కోసం వేధిస్తోందన్నది ఆ ఫిర్యాదు సారాంశం. న్యాయస్థానం ఆదేశాల మేరకు పల్లవి భర్త శ్రీనివాసరావు, ఆయన సోదరి రంభ, వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. రంభ కుటుంబాన్ని విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు. కుటుంబ కలహాలతో పుట్టింటికి వచ్చిన పల్లవి.. ఇక్కడే న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రంభ కుటుంబం సినీ నిర్మాణ రంగంలో ఉంది. కొన్నాళ్లుగా వీరికి ఈ రంగంలో నష్టాలు రావడంతో.. డబ్బు కోసం పల్లవిని వేధిస్తున్నారన్నది పోలీసుల కథనం. రంభ తరహాలోనే గతంలో కథానాయిక ఆమని మీద కూడా ఇలాంటి వరకట్నం కేసు నమోదవ్వడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: