ఈ సంవత్సరం టాలీవుడ్ పరిశ్రమ దిశను నిర్దేశించే భారీ సినిమాలుగా త్వరలో విడుదల కాబోతున్న ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’ సినిమాలు ఎంతటి భారీ స్థాయిలో నిర్మింప బడుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే. టాలీవుడ్ కలక్షన్స్ చరిత్రను ఈ సినిమాలు రెండు తిరగ రాస్తాయని ఈ సినిమాను నిర్మిస్తున్న వారు చాల ఆసల పై ఉన్నారు. దీనికి తగ్గట్టుగా ఈ సినిమాల పై భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. అయితే ఈ రెండు భారీ సినిమాలకు ఒకే సమస్య వెంటాడుతూ ఉండటం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది.

ఈ మధ్య కాలంలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సినిమాలకు ఆ సినిమాలలోని కామెడీ ట్రాక్ చాల సహాయ పడింది. క్రితం సంవత్సరం విడుదలై బ్లాక్ బస్టర్ మూవీ ఆఫ్ 2014గుగా రికార్డుకెక్కిన ‘రేసు గుర్రం’ సినిమా నుండి ‘లౌక్యం’, ‘గీతాంజలి’ తో పాటు ఈ మధ్యనే విడుదలైన ‘పటాస్’ వరకు ఆ సినిమాలు సూపర్ హిట్ సాధించడంలో కామెడీ ప్రధాన పాత్రను పోషించింది. కామెడీ సరిగా లేకుంటే సినిమా ఎంత ఖర్చు పెట్టి పెద్దహీరోలతో తీసినా ఆ సినిమాలను మళ్ళీమళ్ళీ చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడటం లేదు. దీనితో చాల భారీ సినిమాలు భారీగా ఫ్లాప్ అయ్యాయి.

ఈ పరిస్థుతుల నేపధ్యంలో భారీ సెట్టింగులతో భారీ గ్రాఫిక్స్ తో రాజమౌళి, గుణశేఖర్ లు ఎంతో కష్టపడి తీస్తున్న ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ సినిమాలను ఎంత బాగున్నా కామెడీ సీన్స్ లేకుండా ప్రేక్షకులు ఈ రెండు సినిమాలను ఎంత వరకు బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారు అనే సరికొత్త విశ్లేషణలకు కొంతమంది తెర తీస్తున్నారు. ‘బాహుబలి’ పరిస్థితి ఎలా ఉన్నా చారిత్రాత్మక సినిమాగా రూపొందుతున్న ‘రుద్రమదేవి’ సినిమాలో మటుకు కామెడీకి అవకాశమే లేదు.

అయితే ప్రస్తుతం మారిపోయిన ప్రేక్షకుల అభిరుచి వాతావరణంలో ‘బాహుబలి’ ‘రుద్రమదేవి’ లు కామెడీ పంచ్ డైలాగ్స్ లేకుండా విజయం సాధించ గలిగితే టాలీవుడ్ లో ఒక నూతన ఒరవడికి తెర తీసినట్లే అవుతుంది. ఏది ఏమైనా ఈ సంవత్సరం టాలీవుడ్ సినిమా రంగానికి సంబంధించి ఒక ముఖ్యమైన సంవత్సరంగా మారనున్నది..

మరింత సమాచారం తెలుసుకోండి: