దర్శకుడు రాజమౌళి తరువాత ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమ అంతా మాట్లాడుకుంటున్న ఏకైక వ్యక్తి సుకుమార్. ‘నాన్నకు ప్రేమతో’ సినిమా వల్ల వచ్చిన క్రేజ్ తో ఇప్పుడు  మీడియాకు హాట్ టాపిక్ గా మారిపోయాడు సుకుమార్. దీనితో ఈ దర్శకుడు ఏ విషయం పై ఎటువంటి కామెంట్ చేసినా అది మీడియాకు హాట్ టాపిక్ గా మారిపోతోంది. 

గత నెల సంక్రాంతికి వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ అమెరికాలో 2 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ తెచ్చుకోవడమే కాకుండా ఈసినిమా 50 కోట్ల మార్క్ ను దాటిన సందర్భంలో ఒక ప్రముఖ  మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుకుమార్ ఛారిటీ పై విలక్షణ వ్యాఖ్యలు చేసాడు. తనకు విజయాలు వస్తున్నాయి కాని ఆవిజయాల స్థాయిలో తనకు డబ్బులు రాకపోవడంతో తాను సేవా కార్యక్రమాలు చేయలేక పోతున్నాని అంటూ విలక్షణ వ్యాఖ్యలు చేయడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. 

సుకుమార్ తో ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి సుకుమార్ స్వంత జిల్లా అయిన తూర్పు గోదావరి జిల్లాలో ఏదైనా ఒక గ్రామం దత్తత తీసుకునే ఉద్దేశం ఉందా అని అడిగినప్పుడు ప్రస్తుతం తన వద్ద చాలినంత డబ్బు లేదని అందువల్ల డబ్బు బాగా సంపాదించాక తాను ఛారిటీ కార్యక్రమాలు చేస్తాను అని కామెంట్ చేసాడు. ‘ఆర్యా’, ‘100%లవ్’, ‘వన్ నేనొక్కడినే’ లాంటి భారీ సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా గత సంవత్సరం విడుదలైన ‘కుమారి 21 F’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించి కలక్షన్స్ దండుకున్న సుకుమార్ దగ్గర డబ్బులు లేవు అనడం బట్టి నేటి తరం సెలెబ్రెటీలు తమ సంపాదన విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారో అర్ధం అవుతుంది.

ఈ వార్తలు ఇలా ఉండగా సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ తో తీయబోతున్న సినిమాకు తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతం నేపధ్యంగా ఉంటుందని తెలుస్తోంది. కోనసీమ అందాలను చూపెడుతూ ఒక అందమైన ప్రేమ కథను సుకుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమా తరువాత సుకుమార్ చేయబోయే సినిమా కోసం చరణ్ బన్నీ అఖిల్ లు పోటీ పడటం చూస్తూ ఉంటే సుకుమార్ మ్యానియా టాలీవుడ్ ను ఎలా షేక్ చేస్తోందో అర్ధం అవుతోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: