వారం రోజులుగా మీడియాను కబాలి మేనియా కుదిపేసింది. మొత్తానికి సినిమా విడుదలైంది. రజనీ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. కానీ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. అభిమానులు తప్ప మిగిలిన వారిని అంతగా అలరించలేదన్న టాక్ బాగా వినిపిస్తోంది.
ఐతే.. సినిమా సంగతి ఎలా ఉన్నా.. ఈ సినిమాలో తెలుగు వారికి సంబంధించిన ఓ ఆసక్తికర సన్నివేశం ఉందట. ఏపీకి చెందిన రచయిత ప్రొ.వై.బి. సత్యనారాయణగారు రచించిన మై ఫాదర్ బాలయ్య పుస్తకం రజనీకాంత్ జైలులో చదువుతున్న సీన్ ఉందట. దాన్ని చూసిన యువ తెలుగు రచయిత పసునూరి రవీందర్ ఆనందం వ్యక్తం చేశారు..
చాలా సంతోషంగా ఉంది. నా ఆత్మీయ మిత్రులు, ప్రముఖ రచయిత ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లోకి ఈ పుస్తకం అనువాదమయ్యింది. ఈ పుస్తకాన్ని 2012లో డైట్ వ్యవస్థాపకులు డా.పంతుకాల శ్రీనివాస్గారు, సామాజిక ఉద్యమ పెద్దలు బీఎస్రాములు, కత్తిపద్మారావు, డా.జిలుకర శ్రీనివాస్, వేముల ఎల్లన్న, ప్రొ.భంగ్యా భూక్య, ప్రొ.మల్లేశంగార్ల చేతుల మీదుగా గ్రీన్ పార్క్ హోటల్లో ఆవిష్కరించారు.
ఆ సభకు నేనే సభాధ్యక్షుణ్ణి.. అంటూ రచయిత పసునూరి రవీందర్ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. పసునూరి రవీందర్ తెలుగు సాహిత్య అకాడమీ అందుకున్న కథా రచయిత.. ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అనే కథా సంపుటికి తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.