నిన్న విడుడల అయి ఫీల్ గుడ్ మూవీగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘పెళ్ళి చూపులు’ మంచులక్ష్మికి నిరాశను మిగిల్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. మంచు ఫ్యామిలీ నుంచి గత కొంత కాలంగా నిర్మిస్తున్న సినిమాలు అన్నీ పరాజయం అవుతున్న విషయం తెలిసిందే ‘దేనికైనా రెడీ’, ‘దూసుకెళ్తా, ‘కరెంటు తీగ’ మినహాయిస్తే గత పది పన్నెండేళ్లలో మంచు కాంపౌండ్ నుంచి వచ్చిన సినిమాలు చాలా వరకు ఫెయిల్యూర్స్ గానే మిగిలాయి.
ఇక మంచు లక్ష్మి స్వయంగా నిర్మించిన సినిమాల్లో ఏ ఒక్కటీ ఆడలేదు. ‘ఝుమ్మంది నాదం’ దగ్గర్నుంచి ‘దొంగాట’ వరకు అన్ని ఫెయిల్యూర్స్ నే చూసింది మంచులక్ష్మి ఆమెకు అవార్డులు ప్రశంసలు వస్తున్నాయి కలెక్షన్స్ రావడంలేదు. ఈ నేపధ్యంలో ఆమెకు నిర్మాతగా ఓ హిట్టుకొట్టే అవకాశం వచ్చినా వదులుకుంది మంచు లక్ష్మి. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పెళ్లిచూపులు’ ఫుల్ పాజిటివ్ టాక్ తో రన్ అవుతూ ఈ ఏడాది విడుదల అయినటాప్ హిట్ సినిమాలలో స్థానం పొందుతుంది అన్న ప్రచారం జరుగుతోంది.
ట్విస్ట్ ఏమిటంటే ఈ కథను దర్శకుడు తరుణ్ భాస్కర్ ముందు మంచు లక్ష్మికే చెప్పాడట. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె నిర్మాణం చేయలేక పోయింది అని తెలుస్తోంది. తరుణ్ భాస్కర్ తీసిన ‘సైన్మా’ షార్ట్ ఫిలిం చూసి మంచు లక్ష్మి ఈ దర్శకుడిని పిలవడం ఒక సినిమాను చేయడానికి అడ్వాన్స్ కూడ ఇవ్వడం జరిగిందట. అప్పడు ఆమెకు ‘పెళ్లిచూపులు’ కథను తరుణ్ భాస్కర్ చెప్పినప్పుడు ఆకధతో సినిమాను తీయాలని ప్రయత్నించినా కుదరక పోవడంతో ఆ తర్వాత ఈ దర్శకుడు ఈ కథను సురేష్ బాబుకు చెప్పడం అది నచ్చి సురేష్ బాబు నిర్మాత రాజ్ కందుకూరికి పరిచయం చేయడం జరిగింది అని అంటున్నాడు తరుణ్ భాస్కర్.
ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా తెలుగు తెరను ఒక మలయమారుతంలా తాకింది అంటూ విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒకప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘ఆనంద్’ ఏవిదంగా సంచలనాలు సృష్టించిందో ఇప్పుడు కూడ ‘పెళ్ళి చూపులు’ అటువంటి సంచలనాలు సృష్టించడం ఖాయం అని అంటున్నారు. ఏమైనా గడప వద్ద వరకు వచ్చిన అదృష్టాన్ని మంచు లక్ష్మి చేజార్చుకుంది అనుకోవాలి..