బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఏం చేసినా పెద్ద సంచలనమే అవుతుంది. మొన్నటి వరకు హిట్ అండ్ రన్ కేసు, కృష్ణ జింక కేసులతో సతమతమైన సల్లూ భాయ్ ఇప్పుడు శాంతి కాముడిగా మారాడా అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కలిసింది ఓ సామాన్య వ్యక్తిని కాదు ప్రపంచానికి శాంతి దూత ఆధ్యాత్మిక వేత్త దలైలామా. తన లేటెస్ట్ మూవీ ట్యూబ్లైట్ సినిమా కోసం లఢఖ్లో ఉన్న సల్మాన్.. తన గర్ల్ఫ్రెండ్ లూలియా వాంటూర్తో కలిసి దలైలామాతో కాసేపు మాట్లాడాడు. తనతో సల్మాన్ దిగిన ఫోటోను దలైలామా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
మరోవైపు సల్మాన్ ఖాన్ హీరోగా ఏక్ థా టైగర్, బజరంగీభాయిజాన్ చిత్రాల దర్శకుడు కబీర్ ఖాన్ 'ట్యూబ్ లైట్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొంతకాలంగా షూటింగ్ లడఖ్ లోనే జరుగుతోంది. షూటింగ్ జరుగుతున్నంత కాలం సల్మాన్ ఖాన్ తో పాటు అతని ప్రియురాలు లూలియా వేంటర్ కూడా ఉండటంతో ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారనే వాదనకు మరింత బలం చేకూరినట్లయింది.
చైనా నటి జు జు ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. అంతే కాదు 'ట్యూబ్ లైట్' లో భావోద్వేగాలు, హాస్యంతో పాటు కాస్త పొలిటికల్ టచ్ కూడా ఉంటుందని కబీర్ గతంలో చెప్పారు. ఈ సినిమాలో సల్మాన్ ఓ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారట. ఫిల్మ్మేకర్, ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా దలైలామాను కలిశారు.