'బాక్స్ బద్దలౌది', 'చేయిచూడు ఎంత రఫ్ గా ఉందో రఫ్ ఆడించేస్తా'...., 'అంతొద్దు ఇది చాలు'..., వంటి డైలాగ్ లతో తెలుగు సినీ ప్రేక్షకుల చేరువైన మెగా స్టార్ కొనిదెల శివ శంకర వరప్రసాద్ ఆలియాస్ చిరంజీవి అభిమానులు ముద్దుగా పిలుచుకునే చిరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ పేరు తో పిలిచిన చిరంజీవి గా సినీ పరిశ్రమలో వర్దిలారు. చిరంజీవి డైలాగ్ లైతేనేమీ, ఆయన వేసిన దుస్తులైతేనేమీ తెలుగు ప్రజలు రోజూవారీ సంభాషణలుగా, రోజువారి దస్తులుగా వాడటం, సమాజం పై చిరు చూపించిన ప్రభావానికి నిదర్శనం. ఆయన నేటితో 60 వసంతాలు ముగించుకుని నేటితో 61 ఏళ్ల వసంతాలలోకి అడుగిడుతున్నారు. ఈ క్రమంలో ఆయన గురించి సమాజానికి అతి తక్కువ మందికి తెలిసిన కొన్ని విషయాలు మీముందుంచుతున్నాం....
చిరంజీవి కుటుంబ వివరాలు....
1955, ఆగష్టు 22 న పుట్టిన చిరంజీవికి నేటితో 61 ఏళ్ల వయసులోకి వెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూర్ గ్రామంలో కొణిదెల వెంకట్రావ్, అంజనా దేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించారు. తమ్ముళ్లు నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్. నాగేంద్ర బాబు టాలీవుడ్ లో సినిమా నిర్మాతగా , నటుడిగా ప్రసిద్ది చెందారు. ఇక మరో తమ్ముడు పవన్ కళ్యాణ్ టాలీవుడ్ హీరో గా మంచి పేరు సంపాధించుకున్నారు. కాపు సామానిక వర్గానికి చెందిన చిరంజీవి ఏ నాడు కులాల గురించి మాట్లాడిందిలేదు. చూడటానికి అంత వయసు ఉంటుందా అనిపించేలా ఆయన శరీరాకృతి నిజంగా దేవుడిచ్చిన వరంగా ఆయన చెబుతుంటారు. ఇక చిరంజీవి 25 వ ఏటా నాటి ప్రసిద్ద హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖ ను వివాహామాడారు. అనగా 1980 లో చిరంజీవి తో సురేఖ కి వివాహంజరిగింది. వీరిక ముగ్గరు సంతానం ఇద్దరు కుమార్తెలు కాగా ఒక కుమారుడు.
చిరు తనయుడు రామ్ చరణ్ సినీమా ఎంట్రీ....
చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ్ హీరోగా సినిమా లోకి 2007 లో అడుగు పెట్టారు. ఆయన మొదటి సినీమా చిరుత సినీమా తో సినీ ప్రస్థానం మొదలైంది. అనంతరం పలు హీట్ సినీమాలు తీస్తూ తాజాగా తన తండ్రి చిరంజీవి 150 సినీమాకు నిర్మాతగా వ్యవహారిస్తున్నారు. ఇక, చిరంజీవి బాగా నటిస్తారు, అధ్బుతంగా డాన్స్ చేస్తాడు, ఫైట్ ఇరగదీస్తాడన్నది అందరికి తెలిసిన విషయమే. అయితే ఆయన పర్సనల్ అలవాట్లు, హాబీస్ .. ఆయన గురించి అభిమానులకు , ప్రేక్షకులకు అంతగా తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. వాస్తవానికి చీరంజీవికి ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి. ఆయన దృష్టిలో పర్ఫెక్ట్ హీరోయిన్ అంటే ఆమె నట. అందంతో పాటు వృత్తి పట్ల ఎంతో నిబద్దత ఉన్న వ్యక్తి అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
రుద్రవీణ పాటలంటే చిరుకు చాలా ఇష్టమట...
ఇక సినీమాల్లో చిరంజీవికి అత్యంత ఇష్టమైన పాట రుద్రవీణలో పాటలు. ఆయనకే కాదు... ఆవిడ సతీమణి సురేఖకు కూడా చాలా ఇష్టమేనట. ఈ సినీమాలో "నమ్మకు నమ్మకు ఈరేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని" అంటూ చిరంజీవిపై చిత్రీకరించిన పాట చిరంజీవికి ఇష్టమైన పాట అంటూ చిరంజీవి తెలిపారు. అంతకు ముందు సినిమాలు. రాజకీయా ల్లో బిజీ లో పడిచేయలేకపోయినవన్నీ గత రెండేళ్ల కాలంలో పూర్తి చేసానని చిరంజీవి తెలిపారు. ఇకపోతే చిరంజీవి చేతి రాత అస్సలు బావుండదట. ఎంత బావుండదంటే... నేను రాసిన దాన్ని నేనే మళ్లీ చదవలేను. సమయం దొరికినప్పుడల్లా చేతి రాతను మళ్లీ ప్రాక్టీస్ చేస్తున్నానని చిరంజీవి తెలిపారు. ఇక చిరంజీవి చిన్ననాటి నుంచి అబాకస్, సుడోకు లాంటి పజిల్ గేమ్స్ నేర్చుకుంటున్నట్లు... వీటి ద్వారా మెదడు చురుకుగా తయారవుతుందని చిరంజీవి చెప్పుకొచ్చారు.
ఫోటోగ్రపి అంటే చిరు మక్కువ ఎక్కువే...
ఇకపోతే... చిరంజీవి ఫొటోగ్రఫీ పై మక్కువ ఎక్కువేనని చెబుతుంటారు. నాకు చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫి అంటే చాలా ఇష్టమని.... చిన్నప్పుడు కెమెరాలు కొనుక్కోలేకపోయాను. సినిమాల్లోకి వచ్చిన తరువాత నాకు తెలియకుండానే అదొక హాబీగా మారిపోయిందని చిరు స్పష్టం చేశారు. ఒక మార్గాన్ని ఎంచుకొని ఎన్ని అవాంతరాలు వచ్చినా బెదరకుండా... ఆ దారిలో వెళ్లటమే నా విజయానికి ప్రధాన కారణమన్నారు. ఒక చిత్రం తీసి దానిని ఇరవై, ముప్పై ఏళ్ల తరువాత మళ్లీ వారికి ఇస్తే కలిగే ఆనందం కొన్ని కోట్లు రూపాయలు పెట్టినా లభించదని చిరంజీవి అభిప్రాయ పడ్డారు. నా వ్యక్తి గత జీవితం వేరన్న చిరు... ఒక్క చొక్కా విప్పి మరో చొక్కా ఎలా వేసుకుంటామో.. ఇంటి గడపలోనే వృత్తికి సంబంధిచిన విషయాలన్నీ వదిలేస్తానన్నారు. ఇల్లు వేరే ప్రపంచం. దానిలో ఒత్తిడికి ప్రవేశం లేదన్నారు.
చిరు మొదటి సినిమా పునాది రాళ్లు...
నాన్న వెంకట్రావ్ నాకు హీరో నని... ఆమ్మ దగ్గర చనువెక్కువగా ఉండేదన్నారు. నాకు ఏం కావాలన్నా అమ్మకు దగ్గరకు వెళ్లి అడిగేవాడినని, నాన్న అంటే తిడతారనే భయం వేసేదన్నారు. అయితే నాన్న తిట్టినప్పుడు కొన్ని లాభాలు ఉండేవని... తిట్టిన ప్రతిసారి భూట్లు, బట్టలు ఏవో ఒకటి కొని పెట్టే వారని చిరంజీవి తెలిపారు. చెన్నై లోని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తరువాత 1978 లో 'పునాది రాళ్లు' సినిమా చిరంజీవి మొదటగా హీరో నటించారు. కానీ అనూహ్యంగా ఆయన తరువాత నటించిన 'ప్రాణం ఖరీదు' ముందుగా విడుదలైంది. ఈ సినిమాలకు నాటి నిర్మాత జయకృష్ణ ద్వారా 1,116 రూపాయలు మొదటి పారితోషికం తీసుకున్నారట. అనంతరం 'మనవూరి పాండవులు', 'మోసగాడు', 'రానీకాసుల రంగమ్మ', 'ఇది కథ కాదు' వంటి సినీమాల్లో చిన్న పాత్రలు, విలన్ పాత్రలు షోషించారు చిరంజీవి.
అత్యుత్తమ స్థానానికి తీసుకొచ్చిన సినీమాలు....
ఆ తరువాత 'చంటబ్బాయ్', 'ఛాలెంజ్', 'శుభలేఖ' చిత్రాలలో వివిధ తరహా పాత్రల్లో మెప్పించి మంచి గుర్తింపు పొందగా... అనంతరం ఎ. కొదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'ఖైదీ' సినిమాతో చిరంజీవి హీరో గా నిలదొక్కు కున్నాడు. ఆ తరువాత 'ఖైదీ నంబర్ 786', 'గ్యాంగ్ లీడర్' సినిమా కి బలమైన మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. అనంతరం 'రౌడీ అల్లుడు', 'ఘరానా మొగుడు' వంటి వినోదాత్మక చిత్రాలు, 'స్వయం కృషి', 'రుద్రవీణ', 'ఆపద్బాందవుడు' వంటి సున్నితమైన పాత్రాలతో వచ్చిన సినిమాలు కూడా చేశాడు. 1990 దశకం చివరిలో వచ్చిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'హిట్లర్', 'చూడాలని ఉంది' సినిమాలు మంచి విజయాలను సాధించాయి. 2002 లో వచ్చిన 'ఇంద్ర', 'ఠాగూర్' సినిమాలు తారా పధంలో చిరంజీవిని అత్యుత్తమ స్థానానికి తీసుకు వెళ్లింది.
శివుని పాత్రల్లో చిరు అతికినట్లు సరిపోతారు...
చిరంజీవి బావ అల్లు అరవింద్ ప్రముఖ సినిమా నిర్మాత. చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ కూడా సినిమా కథానాయకునిగా తన సత్తా చాటుతున్నాడు. ఇక తెలుగు సినిమా రంగంలో చిరంజీవిని మొదటి యాక్షన్ -డాన్స్ మాస్ హీరోగా చెప్పుకోవచ్చు. అంతకు ముందు హీరోల సినిమాల్లో ఈ అంశాలున్నా వాటికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. 'పసివాడి ప్రాణం' చిత్రం ద్వారా తెలుగు తెరపై మొట్ట మొదటిసారిగా బ్రేక్ డ్యాన్స్ చేసిన ఘనత చిరంజీవి కే దక్కుతుంది. దక్షిణాది హీరోలలలో డాన్స్ చేయడంలో గొప్ప పేరు సంపాదించిన మొదటి హీరో చిరంజీవి మాత్రమే అని చెప్పడంలో సందేహం లేదు. శివుడి పాత్రకి చిరంజీవి అతికినట్లు సరిపోతారు, 'శివుడు శివుడు శివుడు', 'మంజునాథ', 'ఆపద్బాందవుడు' చిత్రాల్లో చిరంజీవి శివుడిగా చూడొచ్చు. ఇందులో 'మంజునాథ' , 'సిపాయి' చిత్రాలు మొదట కన్నడంలో నిర్మించబడినవి, అక్కడ విజయవంతమైన పిమ్మట తెలుగులోకి అనువదించబడింది. చిరంజీవి డాన్సులకే కాకుండా ఫైట్స్ కు కూడా పెట్టింది పేరు. ఆయన ఫైట్స్ శైలి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. డూప్ లేకుండానే రిస్క్ తీసుకుంటారు.
హిందీ సినిమాల్లో చిరు సత్తా చాటుకున్నాడు
చిరు గుర్రపు స్వారీ శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఒక చేత్తో మాత్రమే కళ్ళాన్ని పట్టుకుని మరోక చేయిని గాలిలో వదిలేసి, గుర్రం పైన పూర్తిగా కూర్చోకుండా కొద్దిగా నిలబడి చిరు స్వారీ కంటికి ఇంపుగా ఉంటుంది. 'అంజీ', 'కొండవీటి దొంగ', 'జగదేక వీరుడు అతిలోక సుందరి' వంటి చిత్రాల్లో సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇక చిరంజీవి ఇటు తెలుగులోనే కాకుండా, తమిళం, కన్నడం, హిందీలలో కూడా చిరంజీవి ప్రసిధ్ధుడు. 'గ్యాంగ్ లీడర్' హిందీ పునర్నిర్మాణం 'ఆజ్ కా గూండారాజ్' లో, 'అంకుశం' హిందీ పునర్నిర్మాణం 'ప్రతిబంద్' లో, దక్షిణాదిన విజయవంతమయిన 'జెంటిల్ మేన్' హిందీ పునర్నిర్మాణం 'ది జెంటిల్ మేన్' లో కూడా కథానాయకుడు గా నటించాడు. 'ఘరానా మొగుడు' మలయాళంలోకి 'హేయ్ హీరో' గా అనువదించబడింది. పశ్చిమ ఐరోపా ఖండం, ల్యాటిన్ అమెరికా లలో సైతం చిరు పేరొందాడు. 'దొంగ' చిత్రంలో గోలి మార్ పాటకి మైఖేల్ జాక్సన్ రూపొందంచిన థ్రిల్లర్ ఆల్బం మూలం.
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన చిరు...
ఈ పాటల్లో చిరు మరియు జాక్సన్ నాట్య భంగిమలు, వేషధారణలలో చాలా సామ్యం కనబడుతుంది. అందుకే ఈ దేశాలలో చిరుని ఇండియన్ జాక్సన్ గా వ్యవహరిస్తారు. ఇక కొదమ సింహం చిత్రం ఆంగ్లంలో తీఫ్ ఆఫ్ బాగ్దాద్ అనువాదం గావించబడి నార్త్ అమెరికా, మెక్సికో, ఇరాన్ మరియు ఇతర దేశాల్లో విజయవంతంగా ప్రదర్శింబడింది. అంతేకాకుండా చిరంజీవి సేవాదృక్పధం ఎక్కువే నని చెప్పాలి. ఇందుకోసం చిరంజీవి అక్టోబర్ 2, 1998లో 'చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్' స్థాపించాడు. 'చిరంజీవి బ్లడ్ బాంక్', 'చిరంజీవి ఐ బాంక్' ఈ ట్రస్టు నడుపుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా నేత్రదానం, రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా గుర్తింపు పొందాయి. అభిమానుల ఉత్సాహాన్ని, సేవా దృక్పధాన్ని పెద్దయెత్తున సమాజసేవా కార్యక్రమాలకు మళ్ళించడం ఈ ట్రస్టులు సాధించిన ఘనవిజయంగా చెప్పు కోవచ్చు.
చిరు కు పద్మభూషణ్ పురస్కారం...
వీరి రక్తదానం వలన రాష్ట్రంలో 80,000 మంది, నేత్రదానం వలన 1000 మంది సేవలనందుకొన్నారని అంచనా . ఇప్పటికి ఈ సంస్థలకు 3.5 లక్షల మంది తమ మరణానంతరం నేత్రాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. వరుసగా నాలుగు సంవత్సరాలు ఈ సంస్థలు 'అత్యుత్తమ సేవా సంస్థలు'గా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాల ను అందుకొన్నాయి. జనవరి,2006 లో భారత ప్రభుత్వం తరపున అప్పటి రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలామ్ నుండి పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. నవంబర్ 2006లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటు, ఆంధ్ర యూనివర్సిటీ తరపున అప్పటి ఆంధ్ర గవర్నర్ మరియు చాన్సుల్లర్ రామేశ్వర్ థాకూర్ నుండి మెగా స్టార్ చిరంజీవి అందుకున్నారు.