విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తాను సినిమాలలో నటిచడం తగ్గించుకుని నిర్మాతగా మారి వైవిధ్యమైన సినిమాలు నిర్మిస్తూ తన ఉత్తమ అభిరుచిని చాటుకుంటున్నాడు. ఈ సినిమాలు నిర్మించడం వలన తనకు ఆర్దికంగా నష్టం కలిగినా పట్టించుకోను అంటూ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
‘ఉలవచారు బిరియానీ’ అంటూ ఆ మధ్య వచ్చిన ప్రకాష్ రాజ్ ‘మన ఊరి రామాయణం’ అంటూ దసరాకు రాబోతున్నాడు. ఈసినిమా ఫలితం ఇంకా తేలకుండానే మరో వెరైటీ కథను ఎంచుకుని మరో సినిమాకు శ్రీకారం చుడుతున్నాడు ప్రకాష్ రాజ్.
ఈసినిమాకు ప్రకాష్ రాజ్ ఎంచుకున్న టైటిల్ తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వడం ఖాయం. ఈ సినిమా టైటిల్ ‘అరవై ఏళ్ళు – చామన ఛాయ’ ఆల్జీమర్ వ్యాధితో బాధపడే ఒక వృథ్దుడి కథ ఇది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందించి ఒకేసారి విడుదల చేయాలని ప్రకాష్ రాజ్ ప్రయత్నిస్తున్నాడు.
2017 ప్రారంభంలో మొదలు పెట్టే ఈ సినిమాకు ఇళయరాజా సంగీత దర్శకత్వం వహిస్తాడని టాక్. నటుడుగా ఎంతో పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ నిర్మాతగా దర్శకుడుగా మాత్రం ఇంకా ఎటువంటి విజయాలను అందుకోలేక పోతున్నాడు. ఇతడు తీసిన ‘ధోని’ సినిమా తరువాత ప్రకాష్ రాజ్ చేసిన ప్రయోగాలు అన్నీ విఫలం అవుతున్నాయి.
అయితే దసరాకు రాబోతున్న ‘మనఊరి రామాయణం’ టాలీవుడ్ సినిమా రంగంలో ఒక ట్రెండ్ సెటర్ గా మారుతుందని ప్రకాష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే దసరా రేసుకు వస్తున్న భారీ కమర్షియల్ సినిమాల మధ్య ప్రకాష్ రాజ్ చేస్తున్న ఈ సాహసం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది..