మెగా స్టార్ చిరంజీవికి తన 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ టెన్షన్ తో పాటుగా రామ్ చరణ్ ‘ధృవ’ టెన్షన్ కూడ వెంటాడుతోంది అన్న వార్తలు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి. ఇప్పటికే చిరంజీవి తన 150వ సినిమా పనులతో పాటు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పనులతో బిజీగా ఉన్న నేపధ్యంలో మధ్యలో వెంటాడుతున్న ఈ ‘ధృవ’ టెన్షన్ చిరంజీవికి మరో కొత్త తలనొప్పిగా మారింది అని టాక్.
‘ధృవ’ అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోవడంతో పాటు ఈసినిమా నిర్మాణం పనులు ఇంకా 30 శాతం వరకు మిగిలి ఉన్నాయి అన్న విషయాలను తెలుసుకుని చిరంజీవి తీవ్ర అసహనాన్ని వ్యక్త పరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చరణ్ వరస పరాజయాలతో కూరుకు పోతున్న నేపధ్యంలో చరణ్ నటిస్తున్న ‘ధృవ’ సినిమాను అల్లుఅరవింద్ సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మాణంలో తీస్తున్న నేపధ్యంలో కూడ ఈసినిమా ప్లానింగ్ విషయంలో ఎక్కడ తేడా వచ్చింది అని చిరంజీవి చాల లోతుగా ఆరాలు తీస్తున్నట్లు టాక్.
సామాన్యంగా అల్లుఅరవింద్ పక్కా ప్లానింగ్ తో సినిమాలు తీస్తాడు అని పేరున్న నేపధ్యంలో ‘ధృవ’ విషయంలో ఎక్కడ తేడా జరిగిందో చిరంజీవికే అంతు పట్టడం లేదు అని గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీనికితోడు దర్శకుడు సురేంద్ర రెడ్డి రాజమౌళి సుకుమార్ లా సినిమాలు చెక్కేరకం కాని నేపథ్యంలో ఒక తమిళ సినిమా ‘తని ఒరువన్’ కి రీమేక్గా తీస్తున్న ఒక మామూలు కమర్షియల్ సినిమాకు ఎందుకంత టైమ్ పడుతుందన్నది చిరంజీవికి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది అని టాక్
టాప్ యంగ్ హీరోల మధ్య పోటీ విపరీతంగా పెరిగి పోవడంతో తెలుగు సినిమా బాక్సాఫీస్ లెక్కలు కూడ చాల వేగంగా మారిపోతూ ఉండటంతో వారసుడుగా తన తన స్టార్డమ్ని కొనసాగిస్తాడనుకున్న రామ్చరణ్ తన సినిమాల విషయంలో అనుకున్న రేంజ్ లో సక్సస్ కాకపోవడం చిరంజీవికి బయటకు చెప్పుకోలేని బాధగా మారిపోయింది అని అంటున్నారు.
అంతేకాదు చిరంజీవి తన అనుభవంతో ఎంతో శ్రద్ధ తీసుకుని చరణ్ నటించిన ‘గోవిందుడు అందరివాడేలే’ ‘బ్రూస్ లీ’ సినిమాల విషయంలో స్క్రిప్ట్ నుండి ఎడిటింగ్ దాకా అన్ని విషయాలు దగ్గర ఉండి చూసుకున్నా ఆ సినిమాలు ఫెయిల్ అవ్వడం వెనుక కారణాలు ఇప్పటికి కూడ చిరంజీవికి పజిల్ గా మారినట్లు టాక్.
దీనితో ‘ధృవ’ కి కూడ తన సూచనలు సలహాలు ఇవ్వాలా ? లేదంటే మౌనంగా ఉండాలా ? అనే విషయం పై చిరంజీవి ఎటూ తేల్చుకోలేక పోతున్నాడు అని ఫిలింనగర్ టాక్.
దీనికితోడు ‘ధృవ’ సినిమాను డిసెంబర్ మధ్యలో విడుదల చేస్తే కేవలం మూడు వారాల గ్యాప్ తో వచ్చే తన ‘ఖైదీ నెంబర్ 150’ ‘ధృవ’ కలక్షన్స్ కు శాపంగా మారుతుందా అన్న అనుమానం కూడ చిరంజీవిని వెంటాడుతున్నట్లు టాక్. ఎటు చూసుకున్నా ‘ధృవ’ అయోమయం మెగా స్టార్ కు పెను సమస్యగా మారింది అని అంటున్నారు..