విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారకరామారావు జీవితం మూర్తీభవించిన ఆవేశానికి దర్పణం అని అంటారు. పాత్రలలో లీనమై నటించడమే కాదు. ఆ పాత్రలను తన నిజజీవితానికి ఆపాదించుకున్న మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. రాముడు, కృష్ణుడు పాత్రలతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన మహోన్నత వ్యక్తి నందమూరి. పురాణ పాత్రలకు ప్రాణం పోసినట్లుగా మరెవ్వరూ మనదేశంలో నందమూరి తారక రామారావును అనుసరించ లేకపోయారు.
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీమహావిష్ణువు, పరమ శివుడులతో పాటు పురాణాలలో ప్రతినాయకులైన రావణుడు, దుర్యోధనుడు ఇలా ఏ పాత్ర పేరు చెప్పినా ఈరోజు వరకు తెలుగు వారి హృదయాలో నిలిచి పోయినది నందమూరి రూపమే. సినిమాల్లో నటిస్తూనే తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టి ‘తెలుగు దేశం’ పార్టీ స్థాపించి పల్లె పల్లెనా తన పార్టీ జెండాలు ఎగురవేశారు. అప్పటి వరకు తెలుగు రాష్ట్రాలు ఏలిని కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడారు. ప్రజలకు ఉపయోగ కరమైన ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టి అందరికీ అన్నగా నిలిచారు.
తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయిన నాయకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, దివంగత సీఎం నందమూరి తారకరామారావు 21వ వర్థంతి నేడు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, చిత్ర ప్రముఖులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. హరికృష్ణ, కల్యాణ్రామ్, జూనియర్ ఎన్టీఆర్, భువనేశ్వరి, బ్రహ్మణి తదితర కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పాంజలి సమర్పించి నివాళులర్పించారు.