కన్నడనాట 'బాహుబలి: ది కన్ క్లూజన్'ను విడుదల కానీయబోమని, సత్యరాజ్ క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టిన కన్నడ సంఘాల ఒత్తిడికి ఎట్టకేలకు దిగొచ్చిన సత్యరాజ్ క్షమాపణలు చెప్పారు. ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి కన్నడీలకు తమ సినిమా ఏ ఒక్క వ్యక్తికి సంబంధించింది కాదని సమిష్టి కృషివల్ల ఈ చిత్రం తెరకెక్కిందని గతంలో బాహుబలి కి ఎలాంటి అభ్యంతరం చెప్పని కన్నడీలు ఈసారి అడ్డు చెప్పడం శోచనీయం అని అన్నారు. దయచేసి సినిమా విడుదల ఎలాంటి అవాంతరాలు సృష్టించొద్దని కోరారు.
తన ఒక్కడి కారణంగా 'బాహుబలి ది కంక్లూజన్' సినిమాకి ఇబ్బందులు రాకూడదనే 'కట్టప్ప' సత్యరాజ్ క్షమాపణ చెప్పాడు. కన్నడిగులకు సత్యరాజ్ క్షమాపణ చెప్పిన వ్యవహారానికి సంబంధించి 'కథ' చాలానే వుంది. ఉత్త క్షమాపణ చెప్పేసి ఊరుకోలేదు. ఇకపై సినిమా అవకాశాలు రాకపోయినా తనకు నష్టమేమీ లేదని తేల్చి చెప్పేశాడు సత్యరాజ్. తనకు తమిళ ప్రజల ప్రయోజనాలు ముఖ్యమని క్లారిటీ ఇచ్చాడు. ఈ మేరకు తమిళ తంబీలనూ ప్రసన్నం చేసుకునేలా కొన్ని వ్యాఖ్యలను ప్రస్తావించి, తన కత్తికి రెండు వైపులా పనునుందని ఆయన చెప్పకనే చెప్పారు.
తమిళ ప్రజలు తన క్షమాపణలను అర్థం చేసుకోవాలని, కావేరీ నీటి కోసం తన పోరాటం సాగుతుందని అన్నారు. తమిళ ప్రజల తరఫున వాదనలు వినిపించడాన్ని ఇష్టపడతానని చెప్పి, తమిళులకు ఆగ్రహం కలుగకుండా చూసే ప్రయత్నాలు చేశారు. గతంలో ఈ అంశంపై కన్నడ, తమిళ నటులు పరస్పరం వ్యతిరేక విమర్శలు గుప్పించుకున్నారని గుర్తు చేశారు. కేవలం 'బాహుబలి ది కంక్లూజన్' సినిమాపై క్రియేట్ అయిన హైప్ నేపథ్యంలో, ఈ సినిమాని దెబ్బకొట్టడానికే, సత్యరాజ్ని అడ్డంపెట్టుకున్నారక్కడ. ఇక్కడే, సత్యరాజ్ హుందాగా వ్యవహరించాడు.
'మీ ఖర్మకి మీరే పోతారు..' అన్నట్టుగా క్షమాపణ చెప్పేశాడు. తాను ఎందుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందో తమిళ ప్రజలు, తమిళ సినీ పరిశ్రమ అర్థం చేసుకోవాలంటూ.. మరో 'సందేశం' కూడా సత్యరాజ్ ఇచ్చేశాడండోయ్. అంతా బాగానే వుందిగానీ.. సత్యరాజ్ ఇక్కడితో ఈ వివాదానికి ముగింపు పలికినట్లేనా.? అన్న విషయం ముందు ముందు తెలియాల్సి ఉంది.