తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో అద్భుతమైన గ్రాఫిక్స్ మాయాజాలంతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలుగోడి సత్తా ఏంటో నిరూపించింది. అంతే కాదు అప్పటి వరకు హై బడ్జెట్ చిత్రాలు, టెక్నికల్ గ్రాఫిక్స్ వండర్స్ తో బాలీవుడ్, కోలీవుడ్ దుమ్ముదులిపేవి..కానీ బాహుబలి చిత్రం రిలీజ్ అయ్యాక ఆ ఇండస్ట్రీలు కూడా ఔరా అన్న పరిస్థితికి వచ్చింది. అంతే కాదు ఈ చిత్రం జాతీయ ఉత్తమ చిత్రంగా ఎన్నిక కావడం మరో విశేషం.
తాజాగా బాహుబలి కి సీక్వెల్ బాహుబలి 2 ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అయితే ఈ మద్య కొంత మంది సైబర్ నేరగాళ్లు ఎలాంటి సినిమా వచ్చినా సరే గంటల వ్యవధిలో దాన్ని పైరసీ చేయడం, నెట్ లో పెట్టడం జరుగుతుంది. ప్రభుత్వం వీటిపై ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా వారు చేసేది చేస్తూనే ఉన్నారు. భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లో రిలీజ్ అయిన మూడు గంటల లోపే నెట్ లో ప్రత్యక్షం కావడం...పైరసీలు చేయడం జరుగుతుంది.
ఇప్పుడు ఈ పరిస్థితి బాహుబలి 2 కి రాబోతుందని సమాచారం. ఈ సినిమాకు ప్రీమియం షో పడిన విషయం తెలిసిందే..కొంత మంది క్లిప్పింగ్స్ సోషల్ నెట్ వర్క్ లో అప్ లోడ్ చేశారు. మరోవైపు ఈ సినిమా ఆన్ లైన్ లో కూడా పెట్టినట్లు కొంత మంది చెబుతున్నారు. దీంతో పైరసీ భూతాన్ని తరిమికొట్టేందుకు చిత్ర యూనిట్ చర్యలు తీసుకుంటుంది.
‘బాహుబలి 2’ పైరసీ లింకులు బ్లాక్ చేసేందుకు సిద్దమైంది. ఇంటర్నెట్ లో ఈ సినిమాకు సంబంధించి పైరసీ లింకులు తెలిస్తే తమకు సమాచారం అందించాలని రాజమౌళి బృందం తెలిపింది. blockxpiracy.com,apfilmchamber.com కి లింకులు పంపాలని విజ్ఞప్తి చేసింది. పైరసీ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తుంది. ఎన్నో కోట్లు వెచ్చింది సంవత్సరాలు తరబడి తీసిన చిత్రం అలాంటి చిత్రాన్ని పైరసీ చేసి ద్రోహం చేయవద్దని చిత్ర యూనిట్ కోరుతుంది.