అసలు సినిమాల విషయం లో సింగపూర్ కున్న పరిజ్ఞానమెంత. జానెడు బెత్తెడు దేశం. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న భారత్ లో విభిన్న జాతుల మతాల సంగమ కేంద్రం లో నిర్మించబడ్ద "బాహుబలి ది కంక్లూజన్" సినిమాలో రక్తం ఏరులై పారిందట. అందుకే దానికి A సర్టిఫికేట్ ఇచ్చారట. బాహుబలి-2 ది కంక్లూజన్ ను అవమానించేలా సింగపూర్ ప్రభుత్వం A సర్టిఫికేట్ జారీ చేయటం సినీ అభిమానులను విస్మయానికి గురి చేస్తోంది.
సింగపూర్ సెన్సార్ బోర్డు నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ఈ చిత్రాన్ని విశ్వమంతా అంటే పాకిస్థాన్ తో సహా అన్నీ దేశాలూ ఆదరిస్తుంటే "ఈ సినిమాలో రక్తం ఏరులై పారిందని, దీనికి అభ్యంతరం చెబుతూ ఈ సినిమాకు ఆ రేటింగ్ తో సర్టిఫికేట్ జారీ చేసింది"
ఆ విధంగా ఈ సినిమాను పరిమిత ప్రేక్షకులు మాత్రమే చూసేలా నిర్ణయం తీసుకుంది. అసలు బాహుబలి తెలుగు సినిమాగా చెప్పలేము. ఇది భారతీయ సినిమా. నిర్మాతలు దర్శకులు జన్మతః తెలుగు వారు కావచ్చు. భారతీయలు అసంఖ్యాకంగా మాట్లాడే హిందీ లేదా బాలీవుడ్ వెర్షన్ 500 కోట్ల బాక్స్ ఆఫీస్ కలక్షన్లు సాధించటమే కాదు ప్రముఖ ప్రాంతీయ భాషల్లో వాటి రెగ్యులర్ సినిమాల రికార్డులను అధిగమించి అతి స్వల్ప కాలంలో అంటే మూడంటే మూడు వారాల్లో 1000 కోట్ల వసూళ్ళు సాధించి భారత్ లో "ప్రాంత, భాషా, మత, జాతి" పరమైన ఎల్లలను చెరిపేసిన సినిమా బాహుబలి.
ఇక తెలుగు సినిమా అంటే భారతీయ సినిమాగా అభివర్ణించేంతగా ఎదిగిపోయింది టాలీవుడ్. భారత్లోని అన్నీ "వుడ్లు" ఒకటే భేదం లేదు అనేంత విజయం భారత్ కు అందించింది. ఎవరు ఎన్నైనా సాధించవచ్చు. మూడు వారాల్లో వెయ్యి కోట్ల సినిమా వసూళ్ళు రానున్న చాలాకాలం వరకు శిలాక్షరాలే కావచ్చు. ఇంత విజయాన్ని భారత్ లో మూటగట్టుకున్న ఈ సినిమా ఇప్పటికే విదేశాల్లో 500 కోట్ల రూపాయలు వసూళ్ళు సాధించి మొత్తం కలిపి 2000 కోట్ల వసూళ్ళకు పరుగెడుతుంటే చూసి కుళ్ళు కున్న సింగపూర్ కు అసూయతో చెదలు పట్టిందేమో?
అత్యధిక వసూళ్లతో భారతీయ సినిమాకు సరికొత్త కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చిన చిత్రం బాహుబలి - సినిమారంగం లో "బాహుబలి శకం" ప్రారంభించిన సినిమాకు ఇంత అవమానం జరిగింది. అమరావతి నిర్మాణం కోసం అర్రులు చాచే కాంట్రాక్ట్స్ కోసం చంద్రబాబు చూటూ తిరిగే అతి చిన్న "నగర దేశం" సింగపూర్. అమరావతికి చెందిన సినిమాని అవమానించటం తెలుగు జాతికే అవమానం. అమరావతికే అవమానం. ఇక వీళ్ళ అసూయే అమరావతికి పునాదులైనా ఆశ్చర్యం లేదు. అసలు సింగపూర్ సినిమాలు ఎంత చెత్తగా ఉంటాయో తెలిస్తే అవి బాహుబలి ముందు "హస్తి మశాంతకం" అని చెప్పొచ్చు. చైనా పరిమళాలున్న సింగపూర్ నుండి మంచిని ఊహించలేము.
బాహుబలి ని ఇంతలా అవమానించిన సింగపూర్ కు "టిట్ ఫర్ టాట్" గా రిలీజ్ చేయకూడదని సూచిస్తున్నారు విమర్శకులు. ఇప్పుడు నిర్మాతలు ఈ సినిమా విడుదలను అక్కడ ఆపేస్తారా? సర్టిఫికేట్ ఏదైతేనేమి ఎంతో కొంత వసూళు వస్తాయని రిలీజ్ చేస్తారా? అనేది ఇప్పుడు ప్రశ్న.
చంద్రబాబు నడిగితే తన సన్నిహితుడు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తో మాట్లాడి U సర్టిఫికేట్ ఇప్పించి కూడా విడుదల చేయ వచ్చు. బాహుబలిలాగా అమరావతి నిర్మిస్తా ననే, ముఖ్యమంత్రి మనకుండగా భయమేల! ఇప్పటికే రోజుకు ఆరు ఆటలకు అనుమతి ఇచ్చిన మహనీయుడు ఆ మాత్రం చేయలేరా! మనవారే కదా!