భారత దేశ చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డుల మోత మోగిస్తూ మొట్టమొదటి సారిగా భారతీయ సినిమా చరిత్రలో వెయ్యి కోట్లు వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది ‘బాహుబలి2’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాలకు ఐదు సంవత్సరాలు సమయం పట్టినా..ఆ స్థాయిలో రికార్డుల మోత మోగిస్తూ విమర్శకుల చేత ప్రశంసలు పొందింది. అంతే కాదు ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ స్థాయి జాతీయ స్థాయిలో పెరిగిపోయింది. ఈ చిత్రంలో నటించిన నటులకు కూడా జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించడమే కాకుండా మంచి గుర్తింపు వచ్చింది.
ఇప్పటికే 1500 కోట్ల మార్క్ని తాకిన ఈ ఫిల్మ్, త్వరలో రెండువేల కోట్ల సాధిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఊహించని క్రేజ్ రావడంతో మేకర్స్ ఆలోచనలోపడ్డారు. ఈ క్రమంలో బాహుబలి3 వుంటుందంటూ వార్తలు హంగామా చేస్తున్నాయి. ఈ సినిమా క్లయిమాక్స్ లో రాజసింహాసనం అధిష్టించిన బాహుబలి చేసిన వాగ్ధానం చూస్తుంటే..సినీ ప్రేమికులకు చిన్న ఆశ మొదలైంది.
ఐతే, ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ ట్విట్టర్లో ఓ విషయాన్ని రాసుకొచ్చాడు. ఒకసారి జరిగింది.. రెండవసారి జరగదు. కానీ రెండుసార్లు జరిగింది, మూడవసారి ఖచ్చితంగా జరుగుతుందంటూ అందులో ప్రస్తావించాడు. అయితే ఇప్పటికే బాహుబలి 3 పై ఎలాంటి నిర్ణయం లేదని రచయిత విజయేంద్ర ప్రసాద్, దర్శకులు రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. కాకపోతే బాహుబలి సీరియల్ రూపంలో తెరకెక్కిస్తామన్న జక్కన్న ఏమంటాడో? క్రేజ్ని బట్టి డైరెక్టర్ ఆలోచన మారి.. థర్డ్ పార్ట్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.