చట్టం ఎవరి చుట్టం కాదని మరోసారి నిరూపితమైంది. ఓ ప్రజా ప్రతినిధి..సినీ నిర్మాత గతంలో చేసిన నేరానికి జీవిత ఖైదు విధించింది కోర్టు. వివరాల్లోకి వెళితే..సినీ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు అనకాపల్లి సెషన్స్ కోర్టు బుధవారం జీవితఖైదు విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో మరో 16 మందికి జైలుశిక్ష విధించింది.పదేళ్ల క్రితం తూర్పుగోదావరి జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మ పేటలో బీఎంసీ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో మత్సకారుడు గోసల కొండ మృతి చెందారు. అయితే... మత్స్యకారుడి మృతికి నాటి ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు, ఆయన అనుచరులే కారణమంటూ కోర్టులో కేసు దాఖలైంది.
ఆ కేసుకు సంబంధించిన తీర్పు బుధవారం వెలువడింది. జీవిత ఖైదు పడిన చెంగల వెంకట్రావుకు సినీ పరిశ్రమతో మంచి అనుబంధం ఉంది. గతంలో బాలకృష్ణతో సమరసింహారెడ్డి చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో చెంగలకు సినీ పరిశ్రమలో నిర్మాతగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో నరసింహుడు అనే చిత్రాన్ని నిర్మించి అప్పుల బారిన పడ్డాడు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి, సినీ దర్శకుడు విజయేంద్ర ప్రసాద్తోనూ చెంగల వెంకట్రావు గతంలో గొడవలు జరిగాయి.
చెంగల వెంకట్రావు తన వద్దకు ఓ కథ కోసం వచ్చారు. తనకు డబ్బులివ్వకుండా రూ.30 లక్షల రూపాయలకు రశీదు తీసుకున్నారు. ఆ తర్వాత వేధించడం ప్రారంభించారు. చెంగల వెంకట్రావు తనను కిడ్నాప్ చేసి, సీసీఎస్ కార్యాలయంలో నిర్బంధించి నన్ను కొట్టారు. 60 లక్షల రూపాయల చెక్కు రాయించుకున్నారు అని మానవ హక్కుల కమిషన్కు విజయేంద్ర ప్రసాద్ ఫిర్యాదు చేశారు.
అంతే కాదు ఆ తర్వాత విజయేంద్ర ప్రసాద్పై చెంగల వెంకట్రావు చెక్ బౌన్స్ కేసును వేశారు. నాలుగేళ్ళపాటు వాదోపవాదాలు సాగాయి. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఆ చెక్ బౌన్స్ కేసును కోర్టు కొట్టి వేసింది. విజయేంద్ర ప్రసాద్కు అనుకూలంగా ఏజెఎఫ్సిఎం కోర్టు న్యాయమూర్తి తీర్పు నిచ్చారు.