తెలుగు సినీపరిశ్రమలో దర్శకుడికి గ్లామర్ తీసుకువచ్చిన తొలితరం దర్శకుడు దాసరి నారాయణరావు. కేవలం హీరోల ఇమేజ్ పైనే సినిమాలు ఆడే రోజుల్లోనే ఆయన దర్శకుడి సత్తా ఏంటో పరిశ్రమకు ప్రజలకు చాటారు. దాసరి నారాయణరావు అనే పేరు చూసి ప్రేక్షకుడు సినిమా థియేటర్ కు వచ్చేంత ఇమేజ్ సంపాదించుకున్నారు.
అందుకే దాసరి మృతిపై సినీపరిశ్రమ గుండెలు బాదుకుంటోంది. ప్రత్యేకించి దర్శకులు దాసరి మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ లో
దాసరి మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ.. తెలుగు చిత్రపరిశ్రమలో దర్శకుడనేవాడికి గుర్తింపు తెచ్చిన ఘనత దాసరిదేనని గుర్తు చేసుకున్నారు. ఆయన లోటు ఎవరూ
పూడ్చలేరని చెప్పాడు.
దాసరి నారాయణరావును సినీ పరిశ్రమతో పాటు, పర్సనల్ గా తాము మిస్ అవుతున్నామని రాజమౌళి ట్వీట్ చేశారు. దర్శకులు పూరి జగన్నాథ్, క్రిష్, బోయపాటి వంటి వారు కూడా దాసరి మృతిపై సంతాపం ప్రకటించారు. దాసరి బాటలో పయనించడమే ఆయనకు తామిచ్చే నివాళి అని బోయపాటి అన్నారు. దర్శకుడి సత్తా ఏంటో చాటారని పూరి జగన్నాథ్ గుర్తు చేసుకున్నారు.