బాలీవుడ్ బాద్ షా నటుడు షారూఖ్ ఖాన్ ని అరెస్టు చేయాలంటూ రైల్వే డీఎస్పీ తరుణ్ బరోత్ వడోదర న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోలపై ఎన్నో కేసులు నమోదు కావడం..కోర్టులో సంచలన తీర్పులు రావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు షారూఖ్ ఖాన్ పై ఇలాంటి వివాదాలు రాలేదు..మొదటి సారిగా ఆయనను అరెస్టు చేయాలంటూ రైల్వే డీఎస్పీ తరుణ్ బరోత్ వడోదర న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో పేర్కొనడం పెద్ద సంచలనం అయ్యింది.
వివరాల్లోకి వెళితే..ఈ సంవత్సరం షారూఖ్ నటించిన ‘రయీస్’ సినిమా ప్రమోషన్ లో భాగంగా గత జనవరి 23న వడోదరకు క్రాంతి ఎక్స్ ప్రెస్ లో సహచర నటీనటులతో వడోదర రైల్వేస్టేషన్ వచ్చారు. షారూఖ్ వస్తున్న విషయం తెలుసుకొని అభిమానులు కిక్కిరిసిపోయారు..ఆ సమయంలో అభిమానులను చూసిన షారూఖ్ వారిని ఉత్సాహపరుస్తూ సినిమాకు సంబంధించిన టీషర్టులు, బాల్స్ విసిరాడు. తమ అభిమాన నటుడు టీషర్టులు, బాల్స్ అందుకోవాలన్న ఉత్సాహంతో అభిమానులు పోటీ పడ్డారు..ఈ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుంది.
ఆ సమయంలో ఒక వ్యక్తి దుర్మరణంపాలు కాగా, మరో ఇద్దరు పోలీసులు స్పృహ కోల్పోయారు. ఈ విషయంలపై న్యాయస్థానం నివేదిక కోరడంతో ఈ కేసును రైల్వే డీఎస్పీ తరుణ్ బరోత్ దర్యాప్తు చేశారు. ఈ సందర్భంగా సేకరించిన వివరాలతో ఒక నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. షారూఖ్ ఖాన్ గనక ఆ సమయంలో టీషర్టులు, బాల్స్ విసిరి ఉండక పోతే ఆ వ్యక్తి బతికి ఉండేవాడని ఈ దారుణానికి హీరో షారూఖ్ ఖానే కారణం అని అతనిని అరెస్టు చేయాలని ఆయన నివేదికలో పేర్కొన్నారు.