తెలుగు ఇండస్ట్రీలో కేవలం మూడు చిత్రాలతోనే స్టార్ డైరెక్టర్ హోదా దక్కించుకున్నారు కొరటాల శివ. ఇండస్ట్రీలో వరుస విజయాలు అందుకున్న డైరెక్టర్ గా ఇప్పుడు కొరటాల దర్శకత్వంలో నటించేందుకు కుర్ర హీరోలు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే జనతా గ్యారేజ్ సూపర్ హిట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న కొరటాల తాజాగా మెగా అబ్బాయి రాంచరణ్ తో సినిమా తీయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ధృవ సక్సెస్ తర్వాత సుకుమార్ తో సినిమా ప్రారంభించాడు చెర్రీ.
తన తండ్రి చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు స్వీకరించిన చెర్రీ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం 1985’ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇక ఇండస్ట్రీలో కాంబినేషన్లు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఎప్పుడెప్పుడా అని వెయ్య కళ్లతో ఎదురుచూసేలా చేస్తాయి. ఇప్పుడు అధికారికంగా ప్రకటితమైన మెగా పవర్ స్టార్ రామ్చరణ్, హ్యాట్రిక్ హిట్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కొరటాల శివ కాంబినేషన్ సినిమా అనగానే మెగా ఫ్యాన్స్ తెగ సంబరాల్లో మునిగిపోతున్నారు.
వాస్తవానికి గతంలో చెర్రీ-కొరటాల కాంబినేషన్ లో ఓ సినిమా ప్రారంభం అయి.. పూజా కార్యక్రమాల తర్వాత ఆగిపోయింది. మళ్లీ ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో మూవీని తన సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ తో పాటు.. మ్యాట్నీ ఎంటర్టెయిన్మెంట్స్ తో కలిసి నిర్మించనున్నట్లు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.
తెలుగు ప్రేక్షకులకు `క్షణం`, `ఘాజీ` వంటి కొత్త తరహా సినిమాలను రుచి చూపించిన సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మించే రామ్చరణ్ - కొరటాల శివ కాంబో సినిమా 2018 వేసవికి మొదలు కానుంది.