గత కొంత కాలంగా హైదరాబాద్ లో డ్రగ్స్ దందా అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ సంపన్నుల పిల్లలే ఎక్కువ అలవాటు అవుతున్నారని..మరోవైపు సినిమా ఇండస్ట్రీ వారికి కూడా ఈ డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా ఆ మద్య కొంత మంది నటులు కూడా డ్రగ్స్ కేసులో పట్టుపడటంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. పదిరోజుల క్రితం భారీ స్థాయిలో డ్రగ్స్ ముఠా పట్టుకున్న విషయం తెలిసిందే.
అయితే ముఠా సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కొంత మంది కళాశాల విద్యార్థులు, కాలేజ్ స్టూడెంట్స్,ఐటీ రంగానికి చెందిన వారితో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా వాడుతున్నట్లు తెలిపి పోలీసులకు షాక్ ఇచ్చారు. ఈ రోజు సిట్ కూడా పది మంది సినీ రంగానికి చెందిన 10 మందికి నోటీసులు ఇచ్చింది. ఆరు రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని వారిని ఎక్సైజ్ శాఖ ఆదేశించింది. ముగ్గురు యువ హీరోలు, నలుగురు దర్శకులు, ఇద్దరు నిర్మాతలు, స్టంట్ మాస్టర్కు నోటీసులు ఇచ్చారు.
మాదక ద్రవ్యాల కేసులో ఇద్దరు నిందితులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. ఇక సుమారు 15 మంది నటులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తెలపడంతో వారు ఎవరు అనే విషయంపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు. దీనిపై టాలీవుడ్ ప్రముఖులు ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ పోలీసులు డ్రగ్స్ మాఫియాపై తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రశంసించారు.
పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టు వ్యవహరిస్తే అది కరెక్ట్ కాదు, మీరు చేస్తున్న ప్రతి ఒక్క అంశం ప్రభుత్వం దగ్గర ప్రతి రికార్డు కూడా వారి వద్ద వుంది అని అరవింద్ అన్నారు. కేవలం మీ భవిష్యత్ నాశనం చేయకూడదన్న ఉద్దేశంతోనే పోలీసులు మీ 15 మందిని ఉపేక్షిస్తున్నట్టు తెలిపారు.
ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది.... ఇకపై ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు. కళాకారులు ఆదర్శంగా ఉండాలని, అలా కాకుండా సినీ పరిశ్రమకు చెడ్డపేరు తెచ్చి, సమాజానికి కీడుగా మారితే తీవ్రంగా నష్టపోయేది మీరేనని అల్లు అరవింద్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.