గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ని పట్టి కుదిపేస్తున్న అంశం ఏదీ అంటే వెంటనే చెప్పేస్తారు..డ్రగ్స్ అని. ఇప్పటి వరకు పలువురు సినీ ప్రముఖులను సిట్ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ అంశంపై పలువురు సినిమా తారలు పెదవి విప్పారు. హైదరాబాద్ లో డ్రగ్స్ రాకేట్ ముఠా గుట్టు విప్పిన పోలీసులు చాలా మంచి పని చేశారని అయితే సినిమా ఇండస్ట్రీ వారితో పాటు పలు ఐటీ సంస్థలు, విద్యా, వ్యాపార సంస్థల వారు కూడా ఉన్నారని కేవలం సినిమా ఇండస్ట్రీపైనే ఫోకస్ పెట్టడంతో అందరి దృష్టి సినీ పరిశ్రమపైనే పడుతుందని వాపోయారు ప్రముఖ విప్లవ దర్శకులు, నటులు ఆర్ నారాయణమూర్తి.
ఈ ఉదయం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ..సినిమా పరిశ్రమపై ఎంతో మంది ఆధారపడి జీవిస్తున్నారని అలాంటి వ్యవస్థపై ఇలాంటి మచ్చ పడటం శోచనీయమే అయిన కాకపోతే సినిమావాళ్లతో పాటు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలకు చెందిన ఉద్యోగుల నుంచి రాజకీయ నాయకులు, వ్యాపారులు సైతం డ్రగ్స్ వాడుతున్నారని అభిప్రాయపడ్డారు. 1960 నుంచి దేశంలో డ్రగ్స్ వాడకం ఉందని ఆయన చెప్పారు. అంతే కాదు డ్రగ్స్ విషయంలో గతంలో కూడా టాలీవుడ్ కి సంబంధించిన వారు అరెస్టు అయ్యారని అప్పుడు ఈ విషయం పెద్దగా ఫోకస్ చేయలేదని అన్నారు.
డ్రగ్స్ ముఠా బయట పెట్టిన వివరాల ప్రకారం పాఠశాల చిన్నారులు సైతం డ్రగ్స్ కేసుల్లో బానిసలుగా మారుతున్నారన్న వార్తలు తనను ఎంతో బాధను కలిగించాయని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారత దేశంలో ఈ డ్రగ్స్ మహమ్మారిని సమూలంగా అంతం చేయాలని పోలీసులతో పాటు యువత కూడా దీనికి నడుం బిగించాలని నారాయణమూర్తి అన్నారు.