ప్రపంచంలో ఎంతో పాపులర్ అయిన రియాల్టీ షో బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో కూడా వస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా మంచి క్రేజ్ సంపాదించిన బిగ్ బాస్ తమిళ,కన్నడ భాషల్లో కూడా వస్తుంది. ఇక తెలుగు బుల్లితెరపై మొట్ట మొదటి సారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ‘బిగ్ బాస్’ సందడి చేస్తుంది. మొదట్లో ఈ షో పై చాలా మంది వరకు పెదవి విరిచారు..కానీ రాను రాను కాస్త ఎంట్రటైన్ మెంట్ డోస్ పెంచుతూ రావడంతో ఈ షో పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు.
ఇప్పుడు తెలుగింట ఎక్కడ చూసినా బిగ్ బాస్ టాపిక్ నడుస్తుంది. ఇక వీకెండ్ శని,ఆదివారాల్లో ఎన్టీఆర్ చేసే సందడి అంతా ఇంతా కాదు. ఒక్కో వారం ఒక్కొక్కరూ ఎలిమినేట్ అవుతుండటం ఆ ఎలిమినేషన్ ఎవరా అన్న కుతూహలం చాలా మందిని ఆకర్షిస్తుంది. తాజాగా ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ కి షాక్ తగిలింది. ఇప్పటికే తమిళనాడులో కమల్ హాసన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో పై ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా తెలుగు బిగ్ బాస్ షోకి ఈ ఎఫెక్ట్ తగిలింది.
ఈ షోలో కంటెస్టెంట్ లకు విధించే శిక్షలు అమానవీయం గా ఉన్నాయంటూ సామాజిక కార్యకర్త అచ్యుతరావు రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బిగ్ బాస్ షోపై తనకు అభ్యంతరాలను తెలియజేస్తూ పిటీషన్ దాఖలు చేశారు. బిగ్ బాస్ షో 70 రోజులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే..అయితే చివరి వరకు ఎవరు ఉంటారా అన్న విషయంపై ఇప్పటికే పలు చర్చలు నడుస్తున్నాయి.
కాగా ఈ షోలో ఉండే వారికి చిత్ర విచిత్రమైన.. కొన్ని సార్లు కఠినమైన శిక్షలు కూడా వేస్తున్నారు బిగ్ బాస్. దీనిపై స్పందించన అచ్యుతరావు రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆయన వాదన ప్రకారం శిక్షల పేరుతో నోటికి ప్లాస్టర్లు వేయడం, స్విమ్మింగ్ పూల్లో 50 సార్లు మునిగి లేవమనడం, రాత్రి సమయాల్లో గార్డెన్లో పడుకోమని ఆదేశించటం, గంటల తరబడి ఉల్లిపాయలు కోయమనటం వంటివి అమానవీయ చర్యలని ఆరోపించారు.
ఇది ముమ్మాటికి ప్రత్యక్షంగా వ్యక్తి స్వేచ్చను హరించడం అని..ఆ వ్యక్తి ఇష్టం ఉన్నా లేకపోయినా శిక్ష అమలు పర్చడం అమానవీయం అని ఆయన అంటున్నారు. కాకపోతే ఈ పిటీషన్ పై మానవ హక్కుల సంఘం స్పందించలేదు. ఒకవేళ పిటీషన్ ను హెచ్చార్సీ విచారణకు తీసుకుంటే బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసలు పంపే అవకాశం ఉంది.