తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గణేశ్ మండపాల వద్ద కోలాహలం నెలకొంది. లంబోదరుడి ఆలయాలు భక్తులతో పోటెత్తుతున్నాయి. గణేశుడి మండపాల వద్ద పిల్లా, పెద్దలు సందడి చేస్తున్నారు.ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ నరసింహన్ దంపతులు తొలి పూజ చేయనున్నారు.
57 అడుగుల మహాగణపతి శ్రీ చండీకుమార అనంత మహాగణపతి రూపంలో దర్శనమిస్తున్నాడు. ఇక భారత దేశంలో సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు కూడా వినాయక చవితి పండుగను చాలా వైభవంగా జరుపుకునే ఆనవాయితీ ఉంది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలో స్టార్ హీరోలను బొజ్జగణపయ్యను భక్తి శ్రద్దలతో కొలుచుకుంటారు.
ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు తమ తమ ఇళ్లలో, వీధుల్లో గణపతి సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఇక హీరో రామ్చరణ్ తన తండ్రి చిరంజీవితో కలసి పూజచేస్తున్న ఫోటో షేర్ చేయగా, మోహన్బాబు కుటుంబ సమక్షంలో తాను పూజ చేస్తున్నప్పటి ఫోటో, నాగార్జున గణపతి వద్ద నిల్చున్న ఫోటోలను వారివారి ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు.