తెలుగు ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. మొన్నటి వరకు భారత దేశ వ్యాప్తంగా బాలీవుడ్, కోలీవుడ్ కి మాత్రమే దక్కే గౌరవాలు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ కి కూడా దక్కుతున్నాయి. ఐదు సంవత్సరాలు సుదీర్ఘంగా కష్టపడి తెరకెక్కించిన చిత్రాలు బాహుబలి, బాహుబలి 2 తెలుగు చిత్ర పరిశ్రమ గతినే మార్చాయి.
టెక్నాలజీ పరంగా ప్రపంచ వ్యాప్తంగా అబ్బుర పరిచే విధంగా బాహుబలి ప్రాజెక్ట్ ని అందించారు రాజమౌళి. ఇక బాహుబలి చిత్రానికి గాను ఆప్పట్లో జాతీయ స్థాయి ఉత్తమ చిత్రం అవార్డు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక బాహుబలి 2 భారత దేశంలోనే అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసి రికార్డు నెలకొల్పింది.
తాజాగా సినీ రంగానికి చేసిన అధ్బుతమైన సేవలకు గాను ఎస్ఎస్ రాజమౌళికి ఏఎన్నార్ జాతీయ అవార్డును ప్రధానం చేయనున్నట్లు నటుడు అక్కినేని నాగార్జున చెప్పారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు పేరుమీద ఆయన స్మారకార్థం కుటుంబీకులు ఏటా ఇచ్చే అవార్డు ఈసారి రాజమౌళి వశం అయ్యింది.
తాజాగా ఆయనకు ప్రకటించిన ఈ ఏఎన్నార్ అవార్డును ఈ నెల(సెప్టెంబర్) 17న సాయంత్రం 4.30గంటలకు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి చేతుల మీదుగా రాజమౌళికి అందించనున్నట్లు నాగార్జున తెలిపారు. ఈ కార్యక్రమానికి వేదికగా శిల్పకళా వేదిక కొలువుదీరనుంది.