బాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో విలన్, కమెడియన్, క్యారెక్టర్ పాత్రల్లో నటించిన నటుడు శక్తి కపూర్. ఈయన నటవారసురాలిగా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ శ్రద్దా కపూర్. మొదటి చిత్రం ఆషికీ 2 చిత్రంతో అందరి హృదయాలను కొల్లగొట్టిన ఈ అమ్మడు తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేక పోయాయి. ఓ వైపు మోడలింగ్ మరో వైపు సినిమాల్లో నటిస్తున్న శ్రద్దాకపూర్ పై చీటింగ్, క్రిమినల్ కేసు నమోదు అయ్యింది.
వివరాల్లోకి వెళితే..ముంబాయి పేళ్లు ప్రధాన సూత్రదారి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా జీవిత నేపథ్యంలో హసీనా పార్కర్ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 22న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర అయిన హసీనా పాత్రలో శ్రద్ధాకపూర్ నటించింది. ఇందులో హీరోయిన్ డ్రెస్సులను ఏజేటీఎం సంస్థ సమకూర్చింది.
ఒప్పందంలో భాగంగా ప్రమోషన్లలో తమ బ్రాండ్ దుస్తులే ధరించాలని హీరోయిన్ శ్రద్ధా, ప్రొడ్యూసర్లతో ఆ సంస్థ డీల్ కుదుర్చుకుంది. కానీ, ఒప్పందంలో రాసుకున్నట్లుగా శ్రద్ధా కపూర్ గానీ, సినిమా బృందం గానీ ప్రచార కార్యక్రమాల్లో తమ బ్రాండ్ `ఏజేటీఎమ్ (ఏజే మిస్త్రీ అండ్ థియా మిన్హాస్)`కు ప్రచారం కల్పించడం లేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
అందుకే క్రిమినల్ కేసు పెట్టామని ఆయన చెప్పారు. అక్టోబర్ 26న ఈ కేసుకు సంబంధించిన విచారణ జరగనుంది. మరోపక్క ఈ కేసు విషయంపై శ్రద్ధా కపూర్ నుంచి గానీ, నిర్మాతల నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు.