తెలుగు ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు ఎస్ ఎస్ రాజమౌళి. బుల్లితెరపై తన సత్తా చాటిని రాజమౌళి ‘స్టూడెంట్ నెం.1’ చిత్రంతో దర్శకులుగా మారారు. ఈ చిత్రంతోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యారు. ఇక తెలుగు సినిమా చరిత్రలో కనీ వినీ ఎరుగుని రీతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు భారత దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో దుమ్మురేపిన విషయం తెలిసిందే.
బాహుబలి చిత్రానిక జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు కూడా వచ్చింది. బాహుబలి 2 చిత్రం అయితే కలెక్షన్ల పరంగా రికార్డులు నెలకొల్పింది. అయితే బాహుబలి లాంటి అద్భుతమైన చిత్రానికి కథ అందించింది రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ బాయిజాన్ చిత్రానికి కూడా కథ అందించారు.
తాజాగా విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన 'శ్రీ వల్లీ' సినిమా, ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అనుకున్న స్థాయిలో ఈ చిత్రం విజయవంతం కాలేక పోయింది. సైంటిఫిక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జోనర్ సాధారణమైన ప్రేక్షకులకు అర్థం కాలేదు .. కాన్సెప్ట్ వారిని ఆకట్టుకోలేదు. ఓ కార్యక్రమంలో ఈ సినిమా గురించి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడారు.
సినిమా కథ ఆసక్తికరమైనదేననీ..కానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. తనని నమ్మి నిర్మాతలు కూడా ఖర్చుకు వెనకాడలేదని చెప్పారు. అయితే తాను సరిగ్గా తెరకెక్కించలేకపోవడం వల్లనే ఈ సినిమా పరాజయాన్ని చవి చూసిందని అన్నారు. సినిమా ఇంకాస్త మంచిగా తీయాల్సిన అవసరం ఉండవలసిందని చెప్పారు. ఈ సినిమా ఆదరణ పొందకపోవడానికి తానే కారణమని అంగీకరించారు.