దసరా రేసులో ముందుగా వచ్చిన ‘జై లవ కుశ’ ఇప్పటికే సందడి చేస్తోంది. ఇదే రేసును టార్గెట్ చేస్తూ ‘స్పైడర్’ మరో మూడు రోజులలో విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఇంకా ప్రారంభించకపోవడం వెనుక మహేష్ మురగదాస్ ల సలహాలు కీలకంగా పనిచేసాయి అన్న వార్తలు వస్తున్నాయి. 

ఎప్పుడూ లేని విధంగా మహేష్ సినిమా విడుదలకు సంబంధించి కొనసాగుతున్న ఈ పబ్లిసిటీ మౌనం వెనుక బయటపడని కోణాలు ఉన్నాయి అని అంటున్నారు. మహేష్ గత చిత్రాలు ‘శ్రీమంతుడు’ ‘బ్రహ్మోత్సవం’ సినిమాలకు సంబంధించి ఆ సినిమాల విడుదలకు ఒక వారం రోజులు ముందుగానే భారీ స్థాయిలో పబ్లిసిటీ చేసారు.

అయితే దీనికి భిన్నంగా ‘స్పైడర్’ టీమ్ మాత్రం మౌనంగా ఉండిపోవడానికి ఈసినిమా పై అంచనాలు తగ్గించడానికే అన్న ప్రచారం జరుగుతోంది. ఈమధ్య కాలంలో టాప్ హీరోల సినిమాల పై అంచనాలు ఆ సినిమాలను బాగా దెబ్బ తీస్తున్నాయన్న అభిప్రాయంతో మహేష్ మురగదాస్ లు ‘స్పైడర్’ పబ్లిసిటీ విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు అన్న కామెంట్స్ ఉన్నాయి. అయితే ఈరోజు ఆదివారం నుండి మీడియా ఛానల్స్ లో మహేష్, రకుల్, మురుగదాస్ ఇంటర్వ్యూలు ఉంటాయని సమాచారం లభిస్తున్నప్పటికీ, వాటికి సంబంధించిన ప్రోమోలు మాత్రం ఇప్పటివరకు విడుదల కాలేదు. 

అంచనాలను తగ్గించాలన్న సిద్ధాంతం సరైనదే అయినప్పటికీ అసలు ఏ మాత్రం పబ్లిసిటీ చేయకపోతే సినిమా ఏ విధంగా ప్రేక్షకులకు చేరువ అవుతుంది అన్న అభిప్రాయం మహేష్ అభిమానులలో వ్యక్తం అవుతోంది. దీనికితోడు ‘జై లవ కుశ’ ఇప్పటికే కలక్షన్స్ ప్రవాహంలో దూసుకుపోతున్న నేపధ్యంలో పబ్లిసిటీ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అది ‘స్పైడర్’ కు శాపంగా మారే అవకాశం ఉంది అని అంటున్నారు. 

దీనికితోడు ‘జై లవ కుశ’ ముందుగానే విడుదల కావడంతో ‘స్పైడర్’ కు కోరుకున్న స్థాయిలో ధియేటర్లు దొరకడం లేదు అని అంటున్నారు. ఏమైనా మహేష్ మురగదాస్ ల వ్యూహాలు మహేష్ అభిమానులకు మాత్రమే కాకుండా ‘స్పైడర్’ బయ్యర్లను కూడ ఖంగారు పెడుతున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: