టాలీవుడ్లో ఇటీవల బెనిఫిట్ షోల హంగామా ఎక్కువ అవుతోంది. అగ్రహీరోల సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు ముందు రోజు అర్ధరాత్రి నుంచే ఈ షోల హంగామా నడుస్తోంది. ఈ ఫస్ట్ షోలు చూసేందుకు ఫ్యాన్స్ పడిగాపులు కాయడంతో పాటు ముందు రోజు రాత్రి నుంచే థియేటర్ల వద్ద మకాం వేసి భారీ రేట్లు పెట్టి మరీ టిక్కెట్లు కొంటారు. అంతలా వెయిట్ చేయించిన వారికి షో వేయకుండా సహనం పరీక్షిస్తే చిర్రెత్తుకొస్తుంది. వాళ్లు అక్కడ నానా రచ్చ రచ్చ చేస్తారు.
ఇలాంటి సంఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలాసార్లు జరుగుతున్నాయి. దసరాకు రిలీజ్ అయిన మహేష్బాబు స్పైడర్ సినిమా బెనిఫిట్ షోకు భారీ రేట్లకు టిక్కెట్లు అమ్మి షోలు వేయలేదని గుంటూరు జిల్లా వినుకొండలో థియేటర్ను ధ్వంసం చేసేశారు. ఇక ఈ రోజు రాజా ది గ్రేట్ సినిమా వంతు వచ్చింది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కేంద్రంలో తేజ థియేటర్లో ఈ రోజు రవితేజ నటించిన రాజా ది గ్రేట్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.
రవితేజ రెండేళ్ల తర్వాత నటించిన సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జైటింగ్గా వెయిట్ చేశారు. థియేటర్ యాజమాన్యం నిన్న రాత్రే ప్రీమియర్ షో వేసేందుకు బెనిఫిట్ షో పేరిట టికెట్లు విక్రయించింది. అయితే షో మాత్రం వేయలేదు. దీనిపై ప్రశ్నించిన ప్రేక్షకులకు థియేటర్ యాజమాన్యం నుంచి నిర్లక్ష్యంగా సమాధానం రావడంతో రవితేజ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. థియేటర్లోకి వెళ్లి ఫర్నిచర్ను ధ్వసం చేశారు. చివరకు ఈ సంఘటన పోలీసుల వరకు వెళ్లడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.