టాలీవుడ్ లో ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పెద్ద సంచలనమే సృష్టిస్తోంది. వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.! ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మిపార్వతి ఎపిసోడ్ ను ఈ సినిమాలో చూపించనున్నట్టు వర్మ ఇప్పటికే ప్రకటించారు. వైసీపీ నేత రాకేశ్ రెడ్డి ఈ సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ కు సంబంధించి అటు టీడీపీ నేతలకు, ఇటు వర్మకు మధ్య పెద్ద వార్ జరుగుతన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితాన్ని వక్రీకరించేలా సినిమా తీస్తే సహించేది లేదని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. అసలు ఎన్టీఆర్ పై వర్మ సినిమా తీయడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. అది కూడా లక్ష్మిపార్వతి ఎపిసోడ్ ను తెరకెక్కిస్తాననడంతో ఆ కోపం మరింత పెరిగిపోయింది.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రభాకర్ చౌదరి.. తదితరులు వర్మపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే వర్మ కూడా ఇదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఈ విషయం సీఎం చంద్రబాబు వరకూ తీసుకెళ్లారు టీడీపీ నేతలు. ప్రత్యేకంగా ఈ సినిమాపై చర్చించారు. అయితే చంద్రబాబు మాత్రం లైట్ తీసుకోవాలని సీఎం నేతలకు సూచించారు. ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకమని, దాన్ని వక్రీకరించి తీస్తే ప్రజలు హర్షించరని చంద్రబాబు అన్నారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా చంద్రబాబు వ్యాఖ్యలను సమర్థించారు. చంద్రబాబు చెప్పిన మాటలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు చెప్పారు. తాను ఒకవేళ వక్రీకరించి తీస్తే ఎవరూ సినిమా చూడరని, తాను అలా తీయబోనని చెప్పారు. ఉన్నది ఉన్నట్టే తీస్తానన్నారు. చంద్రబాబు చెప్పినట్టు ఎన్టీఆర్ జీవితం నిజంగా తెరిచిన పుస్తకమేనని వర్మ అన్నారు.