ఈ వారం టాలీవుడ్లో నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వారాంతంలో ముందుగా గురువారం విజయ్ నటించిన అదిరింది సినిమా వచ్చింది. ఇక శుక్రవారం మరో మూడు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. విశాల్ డిటెక్టివ్, సందీప్ కిషన్ కేరాఫ్ సూర్య, మంచు మనోజ్ ఒక్కడు మిగిలాడు రిలీజ్ అయ్యాయి. ఈ మూడు సినిమాల్లో అదిరింది, డిటెక్టివ్, కేరాఫ్ సూర్య మూడు తమిళ్ డబ్బింగ్ సినిమాలే. కేరాఫ్ సూర్య రెండు భాషల్లోను రిలీజ్ అయినా ఈ సినిమా దర్శకుడు సుశీంద్రన్ తమిళ్వ్యక్తే. ఇక మంచు మనోజ్ ఒక్కడు మిగిలాడు తెలుగు సినిమాయే అయినా ఈ సినిమా దర్శకుడు అజయ్ ఆండ్రూస్ కూడా తమిళవాడే కావడం విశేషం. ఇక ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకున్న ఈ నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలా రన్ అవుతున్నాయి. ఈ సినిమాల్లో హీరో ఏది ? జీరో ఏదో ? చూద్దాం.
అదిరింది: రిలీజ్కు ముందే కావాల్సినన్ని వివాదాలు చుట్టుముట్టడంతో విజయ్ మెర్సల్ తెలుగు వెర్షన్ అదిరిందికి బాగా కలిసొచ్చింది. ఇక్కడ లేట్ అయినా వివాదాలు సినిమాకు ఎక్కువుగా ఉండడంతో సినిమా ఎలా ఉందా ? అన్న క్యూరియాసిటీ తెలుగు ప్రేక్షకుల్లో ఎక్కువుగా ఉంది. దీంతో ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్లో తెలుగు సినిమా రేంజ్లో ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమా తెలుగు రైట్స్ రూ.5 కోట్లకు కొన్నారు. ఇప్పటికే రూ.7 కోట్ల గ్రాస్ రూ. 4 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. దీంతో ఈ సినిమా సులువుగానే సేఫ్ జోన్లోకి వెళ్లిపోనుంది. తెలుగులో ఇది పక్కా హిట్ మూవీ.
డిటెక్టివ్: విశాల్ డిటెక్టివ్ మూవీకి టాక్ బాగున్నా మల్టీఫ్లెక్స్, ఏ క్లాస్ సెంటర్ల మూవీ కాడంతో బీ, సీ సెంటర్లలో అనుకున్న రేంజ్లో వసూళ్లు రావడం లేదు. అయితే టార్గెట్ ఆడియెన్స్ వరకు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. క్రిటిక్స్, ప్రేక్షకులు సినిమాను మెచ్చుకుంటున్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం టాక్కు తగినట్టుగా వసూళ్లు రావడం లేదు. ఈ సినిమాకు ఇప్పటి వరకు రూ.కోటి షేర్ మాత్రమే వచ్చింది.
కేరాఫ్ సూర్య: తెలుగు తమిళ భాషల్లో ఈ వారం రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్లో కేవలం రూ.45 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. సినిమాకు వచ్చిన టాక్తో పోలిస్తే ఆ రేంజ్ వసూళ్లు కూడా రాలేదు. డిజాస్టర్ దిశగా ఈ సినిమా వెళుతోంది.
ఒక్కడు మిగిలాడు: మంచు మనోజ్ చేసిన ఒక్కడు మిగిలాడు బాక్సాఫీస్ వద్ద పవర్ చూపించలేకపోయాడు. మంచి సినిమాగా కొన్నివర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం బొక్కబోర్లాపడింది. ఈ సినిమాకు వీకెండ్లో కేవలం రూ.20 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. దీంతో ఈ సినిమా ఫైనల్ షేర్ రూ 1.5-2 కోట్లు వస్తేనే గొప్ప. దీంతో ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ కానుంది. ఫైనల్గా ఈ నాలుగు సినిమాల్లో అదిరింది హీరోగా నిలిస్తే డిటెక్టివ్ యావరేజ్, ఇక కేరాఫ్ సూర్య, ఒక్కడు మిగిలాడు జీరోలు అయ్యాయి.