గత ఏడాది పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై సంచలన విజయం సాధించిన చిన్న సినిమా ‘పెళ్లిచూపులు’. విజయ్ దేవర కొండ రీతు వర్మలకు ఊహించని క్రేజి స్టార్స్ గా ఆసినిమా మార్చి వేసింది. ఈమూవీ కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ తీసిన ఆసినిమాలో కంటెంట్ ఉందని గుర్తించి సీనియర్ నిర్మాత దగ్గుబాటి సురేష్ ఈచిత్రాన్ని తన బేనర్ మీద రిలీజ్ చేశాడు. ఆచిత్రానికి విడుదలకు ముందు ప్రచారం బాగా చేసిముందే సినిమా వాళ్లకు ప్రెస్ వాళ్లకు ప్రివ్యూ వేసి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యేలా చూశాడు సురేష్.
ఇప్పుడు కూడ సురేశ్ బాబు ఇదే తరహాలో ‘మెంటల్ మదిలో’ సినిమాను టేకప్ చేసి ‘పెళ్లిచూపులు’ తరహాలోనే దీనికి కూడా రిలీజ్ కంటే ముందు పాజిటివ్ టాక్ తీసుకు రావడానికి రామానాయుడు ప్రివ్యూ థియేటర్లో ఈచిత్రానికి వరుస బెట్టి ప్రివ్యూలు వేస్తున్నారు. కొన్నిరోజులుగా టాలీవుడ్ సెలబ్రెటీలు ఒక్కొక్కరుగా దీనికి రివ్యూలిస్తున్నారు.
ప్రస్తుతం చాలమంది ఈసినిమాను తెగ పొగిడేస్తున్నారు. వ్యూహాత్మకంగా ‘పెళ్లిచూపులు’ తరహాలోనే ముందే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేసి మంచి బజ్ క్రియేట్ చేసారు. రేపువిడుదల అవుతున్న ఈమూవీ శాటిలైట్ హక్కుల బిజినెస్ కూడ బాగా జరిగింది అని వార్తలు వస్తున్నాయి. దీనికితోడు అమేజాన్ ప్రైమ్ రంగప్రవేశం చేసి ఈ ‘మెంటల్ మదిలో’ కు కూడా ‘అర్జున్ రెడ్డి’కి ఇచ్చిన రేట్ ను ఇచ్చి ఈమూవీ డిజిటల్ రైట్స్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తలప్రకారం ఈచిత్రం పై పెట్టిన పెట్టుబడిలో నాలుగింట మూడొంతులు డిజిటల్ హక్కుల రూపంలోనే వచ్చేసినట్లు సమాచారం. ఈచిత్రానికి కేవలం 2కోట్లు ఖర్చు మాత్రమే అయిందట. ‘పెళ్లిచూపులు’ నిర్మాత రాజ్ కందుకూరి ప్రొడ్యూస్ చేసిన మూవీ ఇది. వివేక్ ఆత్రేయ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈచిత్రంలో శ్రీవిష్ణు-నివేథా పెతురాజ్ జంటగా నటించారు. ఈసినిమా చూసిన వారికి విశ్వనాథ్ కథ జంధ్యాల మాటలు మణిరత్నం దర్శకత్వం గుర్తుకు వస్తుంది అని ఈసినిమా యూనిట్ వారు చేస్తున్న ప్రచారం కొంత అతిగా ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..