టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు సినిమా నటులపై ఎలాంటి బయోపిక్ చిత్రాలు రాలేదే. ఈ మద్య ఎవడే సుబ్రమాణ్యం ఫేమ్ నాగ్ అశ్విన్ అలనాటి మహానటి సావిత్రిపై ఓ బయోపిక్ చిత్రం తీస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి షూటింగ్ షర వేగంగా జరుగుతుంది. మహానటి సావిత్రి పాత్రలో మాళీవుడ్ బ్యూటి కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఇందులో ముఖ్యతారాగణం సమంత, దుల్కన్ సల్మాన్, ప్రకాశ్ రాజ్, మోహన్ బాబు, షాలినీ పాండే, అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ కూడా నటిస్తున్నారట.
ఇదిలా ఉంటే ఈ మద్య టాలీవుడ్ లో మరో సెన్సేషన్ న్యూస్ సందడి చేస్తుంది. దివంగత మాజీ సీఎం, ఆంధ్రుల ఆరాధ్యనటుడు, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని తెరకెక్కే బయోపిక్ల మ్యాటర్ ఇప్పుడు టాలీవుడ్లోను, తెలుగు రాజకీయాల్లోను పెద్ద సంచలనంగా మారింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఎన్టీఆర్ బయోపిక్లు సంచలనం రేపుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే నందమూని బాలకృష్ణ మాత్రం తన తండ్రి జీవిత కథ తో ఓ సినిమా తీస్తున్నారు.
దీనికి సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి నందమూరి అభిమానులకు ఓ శుభవార్త చెప్పారు. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా జనవరిలో ముహూర్తాన్ని జరపుకోనుంది. ఈ సినిమాకోసం ప్రస్తుతం టీజర్ను సిద్ధం చేయిస్తున్నాడట బాలయ్య. ప్రస్తుతం స్క్రిఫ్ట్ వర్క్ జరుపుకుంటోన్న ఈ సినిమాను జనవరి 18న ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా లాంఛ్ చేయనున్నారు.
ఇక ఈ సినిమా కోసం టాప్ టెక్నీషీయన్లు పని చేస్తున్నారు.ఎమ్.ఎమ్.కీరవాణి సంగీత దర్శకుడిగా, సాయి మాధవ్ బుర్రా మాటల రచయితగా, రవివర్మన్ సినిమాటోగ్రాఫర్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన మిగతా టెక్నీషీయన్లు, నటీనటుల ఎంపిక ప్రక్రియ జోరుగా సాగుతోందట. మొత్తంమీద ఎన్టీఆర్ బయోపిక్ ముహూర్తం రోజే చూపించబోయే టీజర్.. ఏ రీతిన ఆకట్టుకుంటుందో చూడాలి.