తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన సుమంత్ హీరోగా ఇప్పటి వరకు పలు సినిమాల్లో నటించారు. అయితే ఒకటీ రెండు సినిమాలు తప్ప పెద్దగా హిట్ సినిమాలు లేవు. ప్రస్తుతం సుమంతో ‘మళ్లీ రావా’ సినిమాలో నటించారు. దీనికి సంబంధించి ఓ యూట్యూబ్ చానల్ లో సుమంత్ తన చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్న వైఎస్ జగన్, తాను ఒకే క్లాసులో చదువుకున్నామని చెబుతూ, తమ జీవితంలో జరిగిన ఓ ఫన్నీ సంఘటనను చెప్పారు.
చిన్నప్పుడు తామిద్దరం బాగా కలిసి తిరిగే వాళ్లమని, బాగా అల్లరి కూడా చేసేవారమని అన్నారు. అయితే ఓకరోజు డిన్నర్ కోసం ఇద్దరమూ బయటకు వెళ్లామని, ఆపై రాత్రి 12 గంటల తరువాత ఇంటికి వచ్చిన వేళ, తాను గోడ ఎక్కి దూకేందుకు జగన్ సహకరించాడని..అదే సమయంలో మా తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు అక్కడికి రావడంతో ఇద్దరం బిత్తరపోయామని అన్నాడు.
అప్పటి వరకు జగన్ ఎవరన్న విషయం తాతయ్యకు తెలియదని..ఆ సమయంలో తాను బాల్కనీ పట్టుకుని వేలాడుతూ, "తాతా... జగన్... రాజశేఖరరెడ్డి కుమారుడు" అని చెప్పగా, సీరియస్ గా చూసి, "నైస్ టూ మీట్ యూ" అని వెళ్లిపోయారని అన్నాడు. అదొక అద్భుతమైన జ్ఞాపకం అని..అది కూడా తాము తాళాలు మర్చిపోవడం వల్లే ఆ పని చేయాల్సి వచ్చిందని అన్నారు.