గత కొంత కాలంగా భారత దేశంలో ‘పద్మావతి’ చిత్రంపై ఎన్ని వివాదాలు చెలరేగాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దీపికా పదుకొణే, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం పద్మావతి. డిసెంబర్ 1న విడుదల కావలసి ఉన్న ఈ చిత్రం పలు వివాదాల కారణంగా వాయిదా పడింది. పద్మావతి చిత్రంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కళాకారులను చంపేస్తామని ఇతర దేశాల్లో బెదిరించరని వ్యాఖ్యానించింది.
ఏ దేశంలోనైనా ఇలా కళాకారులను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడతారా? చాలామంది కష్టపడి ఓ సినిమాను తీస్తే బెదిరింపుల కారణంగా సినిమా విడుదల అవకపోవడం చాలా బాధాకరమని, ఈ దేశంలో ఓ ఫీచర్ చిత్రాన్ని విడుదల కానివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సినిమాని కర్ణిసేన కార్యకర్తలతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు వ్యతిరేఖించడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
అంతేకాదు దీపిక పదుకొణే, సంజయ్ లీలా భన్సాలీ తలని నరికేస్తామని ఆందోళనకారులు వార్నింగ్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. కొందరు కళాకారుల తలలు నరికి రివార్డు ప్రకటిస్తారు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారితో సమానంగా ఆందోళన చేస్తూ సినిమా బ్యాన్ చేస్తారు. ఇది మరో రకమైన సెన్సార్ షిప్ అనుకోవాలా.. పేరు, డబ్బున్న వారికే ఇలా జరిగితే, పేదల సంగతి ఏంటీ అని బాంబే హైకోర్టు న్యాయమూర్తి భారతి డాంగ్రే ప్రశ్నించారు.