మెగా అభిమానుల అంచనాలను విపరీతంగా పెంచేస్తున్న ‘రంగస్థలం’ సినిమాలోని కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయంటూ ఈసినిమా నిర్మాతలకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై సుకుమార్ దర్శకత్వంలో నిర్మించబడుతున్న ఈమూవీలోని సమంత లుక్ గురించి నిన్న మీడియాలో హడావిడి చేసిన ఫోటోలు తాము విడుదల చేసినవి కాదు. ఎవరో కావాలని ఈ ఫోటోలను లీక్ చేసారు అన్న అభిప్రాయాన్ని మైత్రి మూవీస్ నిర్మాతలు వ్యక్త పరుస్తున్నారు. 

రామ్‌చరణ్ సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమా  ఫస్ట్‌ లుక్ కు ప్రేక్షకుల వద్ద మంచి స్పందనరావడంతో    గత రెండురోజులుగా ఈ సినిమాలోని సమంత చెర్రీలకు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  అయితే ఈ ఫోటోలు అనధికారికంగా ఎవరో బయటకు వదులుతున్నారంటూ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు అని వార్తలు వస్తున్నాయి. 

మైత్రి మూవీస్ వారు చెపుతున్న విషయాల ప్రకారం డిసెంబర్ 9వ తేదీన రెండు ఫోటో స్టిల్స్ ఆ మరుసటిరోజు మరో రెండు స్టిల్స్ అనధికారికంగా ఎవరో బయటకు వదిలారు అని అంటున్నారు. ఇవికాక వారి దగ్గర సినిమాకు సంబంధించిన వేరే డేటా కూడా ఉండవచ్చని తమ అనుమానం అంటూ మరో ట్విస్ట్ ఇచ్చారు ఈ సినిమా నిర్మాతలు.   అంతేకాదు ఈ లీకుల వల్ల సినిమా ప్రమోషన్స్‌ పై తీవ్రప్రభావం పడే అవకాశం ఉంది అని మైత్రి మూవీస్ నిర్మాతల అభిప్రాయం. 

ఇది ఇలా ఉండగా ఈసినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కాకుండానే ఈసినిమాకు జరుగుతున్న బిజినెస్ టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. ఈమూవీకి రోజురోజుకు పెరిగిపోతున్న క్రేజ్ ను బట్టి ఈమూవీ  ఖచ్చితంగా చరణ్ కు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న బ్లాకు బస్టర్ హిట్ ను అందిస్తుంది అని అంటున్నారు. ఏది ఎలా ఉన్న ఈ సినిమా ఫోటోల లీకుల విషయంలో ఇప్పడు జరుగుతున్న హడావిడి టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: